వైసీపీ అధ్యక్షుడు , ఏపీ సీఎం జగన్ ప్రచారంలో దూకుడు పెంచేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే సిద్ధం పేరుతో నాలుగు బహిరంగ సభలు నిర్వహించారు. భీమిలి, దెందులూరు, రాప్తాడు, మేదరమెట్లలో జరిగిన సభల ద్వారా నాయకులను, కార్యకర్తలను ఎన్నికలకు సన్నద్ధం చేశారు.
ఎన్నికల షెడ్యూల్ విడుదల రోజే 175 నియోజకవర్గాల ఎమ్మెల్యే అభ్యర్థులను జగన్ ప్రకటించారు. అనకాపల్లి మినహా 24 లోక్ సభ స్థానాలకు అభ్యర్థుల పేర్లను వెల్లడించారు. ఇప్పుడు ప్రచారంపై మరింత ఫోకస్ పెట్టారు. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు బస్సు యాత్ర చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. మేమంతా సిద్ధం పేరుతో ఈ యాత్ర చేపట్టాలని నిర్ణయించారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లు కవర్ అయ్యేలా బస్సు యాత్రకు ప్రణాళికలు రూపొందించారు.
బస్సు యాత్రలో వైఎస్ జగన్ ఉదయం ప్రజలతో ఇంటరాక్ట్ అవుతారు. మధ్యాహ్నం, సాయంత్రం వేళ బహిరంగ సభలు నిర్వహించనున్నారు. మార్చి 26 లేదా 27 తేదిన బస్సు యాత్ర ప్రారంభమవుతుంది. మొత్తం 21 రోజులపాటు సాగుతుంది. ఇడుపులపాయలో బస్సు యాత్రకు శ్రీకారం చుడతారు.
మరోవైపు మేనిఫెస్టోపైనా వైసీపీ అధినేత జగన్ కసరత్తులు చేస్తున్నారు. గతంలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేశామని ఆయన ప్రతి సభలోనూ చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ఏ హామీలు ఇస్తారనే ఆసక్తి నెలకొంది. ఓటర్లకు ఎలాంటి తాయిలాలు ప్రకటిస్తారనే చర్చ నడుస్తోంది.
అటు టీడీపీ, జనసేన , బీజేపీ కూటమి ప్రచారంలో దూకుడు పెంచింది. ఈ మూడు పార్టీల ఆధ్వర్యంలో ఆదివారం చిలకలూరిపేటలో బహిరంగ సభ నిర్వహించి వైసీపీకి సవాల్ విసిరాయి. తమ సభ గ్రాండ్ సక్సెస్ అయ్యిందని ఆ మూడు పార్టీల నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఎన్డీఏ కూటమికి దీటుగా ఎన్నికల ప్రచారం నిర్వహించాలని వైఎస్ జగన్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బస్సు యాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు.









