టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారంపై మరింత ఫోకస్ పెట్టారు. ఉండవల్లిలోని తన నివాసంలో పార్టీ నేతలతో సమీక్ష నిర్వహించారు. ఆదివారం చిలకలూరి పేటలో నిర్వహించిన ప్రజాగళం సభపై చర్చించారు. ఎన్నికల ప్రణాళిలపై సమాలోచనలు చేశారు. ప్రజాగళం పేరుతో వరసుగా సభలు నిర్వహించాలని నిర్ణయించారు.
చిలకలూరిపేటలో నిర్వహించిన సభలో పోలీసులు వ్యవహరించిన తీరును టీడీపీ నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. సభ సరిగ్గా జరగకుండా చేయాలని కుట్రలు చేశారని ఆరోపించారు. పోలీసుల ప్రయత్నాలను టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు తిప్పికొట్టారని తెలిపారు. వైసీపీ ఒత్తిడితోనే పోలీసులు ఇలా వ్యవహరించారని ఆరోపించారు. ఎవరు ఎలాంటి కుట్రలు చేసిన విజయం మనదేనని నేతలు ధీమా వ్యక్తంచేశారు.
వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ ‘మేము సిద్ధం’ పేరుతో బస్సు యాత్రకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ కూడా మరింత విస్తృతంగా జనంలోకి వెళ్లాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే భారీ బహిరంగ సభలకు నిర్వహించాలని భావిస్తోంది. తొలి విడతలో ప్రతి జిల్లాలో ఒక సభ నిర్వహించేలా ప్రణాళికలు రూపొందిస్తోంది.
టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ఈ బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. వైసీపీకి ధీటుగా ప్రచారం నిర్వహించాలని చంద్రబాబు యోచిస్తున్నారు. ప్రజల్లో పార్టీపై ఆదరణ మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. ఈ సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్, బీజేపీ సీనియర్ నేతలు పాల్గొననున్నారు.









