UPDATES  

NEWS

 ఏడు సముద్రాలు దాటి కన్నతల్లి కోసం.. డెన్మార్క్ దంపతుల అన్వేషణ!

రక్త సంబంధం లేకపోయినా, తాము ప్రాణప్రదంగా పెంచుకుంటున్న బిడ్డ మనసులోని వెలితిని తీర్చేందుకు ఒక విదేశీ జంట సాగిస్తున్న ప్రయాణం అందరినీ కదిలిస్తోంది. 2016లో ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో పుట్టిన ఒక మగ శిశువు, చేతివేళ్ల వైకల్యం కారణంగా తల్లిదండ్రులచే వదిలివేయబడ్డాడు. ఆ శిశువును డెన్మార్క్‌కు చెందిన లూయిస్, రాస్మస్ అనే దంపతులు చట్టబద్ధంగా దత్తత తీసుకుని, అర్జున్ అని పేరు పెట్టి తమ దేశానికి తీసుకెళ్లారు. ప్రస్తుతం తొమ్మిదేళ్ల అర్జున్ తన మూలాల గురించి, తనను కన్నవారి గురించి తెలుసుకోవాలని ఆరాటపడటంతో, ఆ బిడ్డ కోరిక మేరకు ఈ దంపతులు ఆదిలాబాద్ చేరుకున్నారు.

ముంబై హైకోర్టు అడ్వకేట్ అంజలి పవార్ సహకారంతో ఈ దంపతులు ఆదిలాబాద్‌లోని ఇంద్రవెల్లి, నార్నూర్ మండలాల్లోని మారుమూల గిరిజన గ్రామాల్లో అన్వేషణ సాగిస్తున్నారు. సాధారణంగా దత్తత తీసుకున్న వారు పిల్లలకు వారి గతాన్ని చెప్పడానికి ఇష్టపడరు, కానీ ఈ డానిష్ దంపతులు మాత్రం అర్జున్ తన కన్నవారిని కనీసం ఏడాదికోసారైనా కలవాలన్న ఉద్దేశంతో ఈ ప్రయత్నం చేస్తున్నారు. విదేశీయుల మానవత్వాన్ని చూసి స్థానిక ఆదివాసీలు వారికి డప్పు చప్పుళ్లతో ఘనస్వాగతం పలికి, బాబు తల్లిని వెతికే పనిలో తమ వంతు సహకారం అందిస్తున్నారు.

తొమ్మిదేళ్ల క్రితం రిమ్స్ ఆసుపత్రిలో చేతివేళ్ల వైకల్యంతో ఉన్న బాబును వదిలేసిన వారు ఎవరైనా ఉంటే, తమను సంప్రదించాలని ఈ దంపతులు కోరుతున్నారు. వివరాలు తెలిపిన వారి పేర్లను అత్యంత గోప్యంగా ఉంచుతామని, ఆ కుటుంబానికి తాము ఆర్థికంగా కూడా అండగా ఉంటామని వారు హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ దంపతులు ఆదిలాబాద్‌లోనే ఉండి తమ అన్వేషణను కొనసాగిస్తున్నారు. ఎవరైనా సమాచారం ఇవ్వాలనుకుంటే 9822206485, 8329403661 నంబర్లను సంప్రదించవచ్చు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |