తెలంగాణలోని అన్నదాతలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీపి కబురు అందించింది. రాష్ట్రంలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల కంటే ముందే ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘రైతు భరోసా’ నిధులను విడుదల చేయాలని సర్కార్ నిర్ణయించింది. వాస్తవానికి ఎన్నికల తర్వాతే ఈ నిధులు జమ అవుతాయని అందరూ భావించినప్పటికీ, ప్రస్తుత సమాచారం ప్రకారం ఈ నెల 11వ తేదీ లోపు, అంటే పోలింగ్ కంటే ముందే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసేలా అధికారులు వేగంగా చర్యలు చేపడుతున్నారు.
ప్రస్తుతం ప్రభుత్వ ఖజానాలో నిధుల కొరత ఉన్నప్పటికీ, రైతుల సంక్షేమం దృష్ట్యా బహిరంగ మార్కెట్ నుంచి రుణాలు సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నుండి సుమారు రూ. 9,000 కోట్ల రుణాల కోసం తెలంగాణ ప్రభుత్వం ఇండెంట్ పెట్టింది. ఫిబ్రవరి 10న ఆర్బీఐ నిర్వహించే ఈ-వేలం ద్వారా ఈ నిధులు సేకరించి, మరుసటి రోజే నేరుగా రైతుల ఖాతాలకు మళ్లించే అవకాశం ఉంది. దీనివల్ల ఒక్కో రైతుకు ఎకరానికి రూ. 6,000 చొప్పున సాయం అందనుంది.
మున్సిపల్ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పటికీ, ఈ పథకం అమలుకు ఎటువంటి ఇబ్బందులు కలగవని విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే ఎన్నికల కోడ్ కేవలం కొత్త పథకాలకు మాత్రమే వర్తిస్తుంది; రైతు భరోసా అనేది గతంలో నుంచే కొనసాగుతున్న పథకం కాబట్టి నిధుల విడుదలకు ఎన్నికల సంఘం అడ్డంకులు చెప్పే అవకాశం లేదు. ప్రభుత్వ బ్యాంక్ అకౌంట్ల నుంచి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (DBT) పద్ధతిలో ఈ సొమ్ము నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలకు చేరుతుంది.








