ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి (SSC) పబ్లిక్ పరీక్షల షెడ్యూల్లో పాఠశాల విద్యాశాఖ కీలక మార్పులు చేసింది. మార్చి 16వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో, క్యాలెండర్ ప్రకారం ఉగాది మరియు రంజాన్ పండుగలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన ఒక పరీక్ష తేదీని మాత్రమే మారుస్తూ విద్యాశాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
ముఖ్యంగా, మార్చి 20వ తేదీన జరగాల్సిన ఇంగ్లీష్ పరీక్షను మార్చి 21వ తేదీకి వాయిదా వేశారు. పండుగల కారణంగా విద్యార్థులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఈ స్వల్ప మార్పు చేసినట్లు అధికారులు వెల్లడించారు. మిగిలిన పరీక్షలన్నీ ముందస్తు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని, పరీక్షా సమయాల్లో ఎలాంటి మార్పు లేదని (ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:45 వరకు) స్పష్టం చేశారు.
సవరించిన టైమ్టేబుల్ ప్రకారం.. మార్చి 16న ఫస్ట్ లాంగ్వేజ్, 18న సెకండ్ లాంగ్వేజ్, 21న ఇంగ్లిష్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆ తర్వాత మార్చి 23న మ్యాథమెటిక్స్, 25న ఫిజికల్ సైన్స్, 28న బయాలజికల్ సైన్స్ పరీక్షలు జరుగుతాయి. చివరగా మార్చి 30న సోషల్ స్టడీస్ పరీక్షతో ప్రధాన పరీక్షలు ముగుస్తాయి. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ మార్పును గమనించి పరీక్షలకు సిద్ధం కావాలని విద్యాశాఖ సూచించింది.









