తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరోసారి కార్చిచ్చు రేపింది. ఈ కేసులో విచారణకు రావాలంటూ సిట్ (SIT) అధికారులు జారీ చేసిన నోటీసులపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్రంగా స్పందించారు. నంది నగర్లోని తన నివాసం గోడకు నోటీసులు అతికించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ జూబ్లీహిల్స్ ఏసీపీకి ఆయన ఒక ఘాటు లేఖ రాశారు. ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా, ప్రతిపక్ష నేతగా తాను విచారణకు సహకరిస్తానని, ఫిబ్రవరి 1వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు అందుబాటులో ఉంటానని ఆయన స్పష్టం చేశారు.
అయితే, పోలీసులు అనుసరిస్తున్న తీరు రాజ్యాంగ విరుద్ధమని కేసీఆర్ తన లేఖలో ఆరోపించారు. 65 ఏళ్లు దాటిన వారిని వారి నివాసం వద్దే విచారించాలని చట్టం చెబుతోందని గుర్తు చేస్తూ, తన ప్రస్తుత నివాసం ఎర్రవల్లిలో ఉందని, అక్కడే విచారించాలని ఆయన పోలీసులకు సూచించారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఉల్లంఘిస్తూ నోటీసులు జారీ చేయడం కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని ఆయన హెచ్చరించారు. పోలీసుల చర్యలు తన వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
మరోవైపు కేసీఆర్ విచారణ నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా భారీ నిరసనలకు పిలుపునిచ్చాయి. హరీష్ రావు నోటీసుల విషయంలో కూడా పోలీసులు ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారని కేసీఆర్ విమర్శించారు. ఫిబ్రవరి 1న జరిగే ఈ విచారణలో కేసీఆర్ ఎలాంటి వివరణ ఇస్తారనేది ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది.









