UPDATES  

NEWS

 హైవేపై సంక్రాంతి సందడి: విజయవాడ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్.. కిలోమీటర్ల మేర వాహనాల క్యూ!

సంక్రాంతి పండుగ వేళ హైదరాబాద్ నగరం పల్లె బాట పట్టింది. ఏపీలోని తమ సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి (NH-65) జనసంద్రంగా మారింది. పంతంగి టోల్‌ప్లాజా వద్ద ఆదివారం తెల్లవారుజాము నుంచే వాహనాల తాకిడి ఒక్కసారిగా పెరగడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. శనివారం సాయంత్రం నుంచి ఆదివారం ఉదయం వరకు సుమారు 70 వేల వాహనాలు ఈ టోల్ ప్లాజా దాటి ఏపీ వైపు వెళ్లాయని అధికారులు వెల్లడించారు.

రద్దీని దృష్టిలో ఉంచుకుని పంతంగి, కొర్లపహాడ్, చిల్లకల్లు టోల్‌ప్లాజాల వద్ద అధికారులు అదనపు టోల్ బూత్‌లను అందుబాటులోకి తెచ్చారు. ఫాస్టాగ్ (FASTag) స్కానింగ్ వేగంగా జరిగేలా సాంకేతిక ఏర్పాట్లు చేయడంతో పాటు, అత్యవసర సేవల కోసం అంబులెన్స్, పెట్రోలింగ్ వాహనాలను సిద్ధంగా ఉంచారు. అయితే, ఏపీలోని నందిగామ వై-జంక్షన్ వద్ద రోడ్డు విస్తరణ పనులు జరుగుతుండటంతో అక్కడ వాహనాలు నెమ్మదిగా సాగుతున్నాయి, దీనివల్ల ప్రయాణికులు కొంత ఇబ్బంది ఎదుర్కొంటున్నారు.

జాతీయ రహదారితో పాటు ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాల్లోని ఆర్టీసీ బస్టాండ్‌లు కూడా ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. సెలవులు ప్రారంభం కావడంతో విద్యార్థులు, ఉద్యోగులు తమ కుటుంబాలతో కలిసి భారీగా తరలివస్తున్నారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా తెలంగాణ ఆర్టీసీ ఖమ్మం వంటి ప్రధాన కేంద్రాలకు ప్రత్యేక బస్సులను నడుపుతోంది. అటు రైళ్లు, ఇటు బస్సులు అన్నీ నిండిపోవడంతో చాలా మంది సొంత వాహనాలపై పయనం అవుతుండటమే హైవేపై భారీ రద్దీకి కారణమవుతోంది.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |