మహిళల ప్రపంచకప్ను గెలుచుకుని చరిత్ర సృష్టించిన భారత మహిళల క్రికెట్ జట్టు, ఆ ఘన విజయం తర్వాత తమ తొలి అంతర్జాతీయ సిరీస్కు సిద్ధమైంది. ఈ సిరీస్లో భాగంగా తొలి రెండు టీ20 మ్యాచ్లకు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం వేదికగా నిలవనుంది. ఈ సందర్భంగా ఏపీ మంత్రి నారా లోకేశ్ భారత జట్టుకు స్వాగతం చెబుతూ సోషల్ మీడియాలో ప్రత్యేక పోస్ట్ చేశారు.
భారత్–శ్రీలంక మహిళల జట్ల మధ్య డిసెంబర్ 21 నుంచి 30 వరకు టీ20 సిరీస్ జరగనుంది. ఇందులో తొలి రెండు మ్యాచ్లు డిసెంబర్ 21, 23 తేదీల్లో విశాఖలోని ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో నిర్వహించనున్నారు. విశాఖకు ఈ మ్యాచ్లు రావడంపై లోకేశ్ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, ఈ మ్యాచ్లు విశాఖలో క్రికెట్ పండుగ వాతావరణాన్ని తీసుకొస్తాయని పేర్కొన్నారు.
భారత మహిళల జట్టు ప్రపంచకప్ ప్రయాణం విశాఖ నుంచే ప్రారంభమైందని నారా లోకేశ్ గుర్తుచేశారు. వరల్డ్ కప్కు ముందు నెల రోజుల పాటు ఇక్కడే శిక్షణ శిబిరం నిర్వహించారని, ఇప్పుడు విశ్వవిజేతలుగా నిలిచిన తర్వాత తొలి మ్యాచ్లను కూడా విశాఖలోనే ఆడడం గర్వకారణమని పేర్కొన్నారు. ప్రపంచకప్ గెలిచిన తర్వాత ఛాంపియన్లు ఆడుతున్న తొలి సిరీస్ కావడంతో ఈ మ్యాచ్లపై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.









