తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా కీలక కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు నిర్వహించారు. హైదరాబాద్లో మెస్సీ మ్యాచ్ అనంతరం ఢిల్లీకి చేరుకున్న ఆయన, మంగళవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో పాటు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్లను కలిశారు. ఈ సమావేశాలు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చించేందుకు జరిగినట్లు అధికారులు తెలిపారు.
ఈ భేటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్ డాక్యుమెంట్ను అందజేశారు. అలాగే, రాష్ట్రంలో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్వహణకు వెచ్చిస్తున్న వ్యయాన్ని ఎఫ్ఆర్బీఎం (FRBM) నిబంధనల నుంచి మినహాయించాలని కూడా ఆయన కేంద్ర మంత్రిని కోరారు.
అనంతరం, సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో విద్యా రంగానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వ ఆలోచనలు, భవిష్యత్ ప్రణాళికలపై చర్చించినట్లు సమాచారం. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర సహకారం అవసరమయ్యే కీలక అంశాలపై దృష్టి సారించడం ఈ ఢిల్లీ పర్యటన ముఖ్య ఉద్దేశమని తెలుస్తోంది.









