ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ (Lionel Messi) భారత పర్యటనలో భాగంగా హైదరాబాద్కు చేరుకున్నారు. 14 ఏళ్ల తర్వాత మెస్సీ భారత్కు రావడం ఇది రెండోసారి. ప్రత్యేక విమానంలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన మెస్సీకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా స్వాగతం పలికారు. మెస్సీ రాక దేశవ్యాప్తంగా ఫుట్బాల్ అభిమానులకు ఒక గొప్ప అవకాశంగా మారింది, ముఖ్యంగా హైదరాబాద్లో జరిగే ఈవెంట్పై అందరి దృష్టి నెలకొంది.
ఎయిర్పోర్ట్ నుంచి మెస్సీ నేరుగా చారిత్రక ఫలక్నుమా ప్యాలెస్కు చేరుకున్నారు. అక్కడ కేవలం 100 మందితో ఏర్పాటు చేసిన ప్రత్యేక మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో అభిమానులు మెస్సీతో ప్రత్యేకంగా ఫోటోలు తీసుకోవాలనుకుంటే పెద్ద మొత్తంలో చెల్లించాల్సి ఉంటుంది. ఒక్క ఫోటో కోసం రూ. 10 లక్షల వరకు చెల్లించాలని నిర్వాహక కమిటీ సలహాదారు పార్వతిరెడ్డి వెల్లడించారు. ఈ అవకాశాన్ని పొందడానికి ఇప్పటికే 60 మందికి పైగా రిజిస్టర్ చేసుకున్నారు.
మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం అనంతరం మెస్సీ ఉప్పల్ స్టేడియానికి వెళ్లనున్నారు. ఆయన టూర్ షెడ్యూల్, కార్యక్రమాలు, టిక్కెట్ల వివరాలు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారాయి. హైదరాబాద్లో మెస్సీ పర్యటన నేపథ్యంలో ఫుట్బాల్ అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నందున భద్రతా ఏర్పాట్లు పటిష్ఠం చేశారు.









