UPDATES  

NEWS

 ‘వందేమాతరం’పై సుధామూర్తి: స్కూళ్లలో తప్పనిసరి చేయాలని రాజ్యసభలో విజ్ఞప్తి!

ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అర్ధాంగి, రాజ్యసభ సభ్యురాలు సుధామూర్తి ‘వందేమాతరం’ గీతంపై తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. తాను చిన్నతనంలో ఈ గీతాన్ని ఎంతో ఆస్వాదించానని, భావితరాలు కూడా దీనితో మమేకమై గర్వపడాలని ఆశిస్తున్నట్లు శుక్రవారం నాడు పార్లమెంటు వెలుపల అన్నారు. వందేమాతరం గీతంపై వివాదం నడుస్తున్న నేపథ్యంలో ఆమె వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

అంతకుముందు, రాజ్యసభలో ఈ అంశంపై మంగళవారం జరిగిన చర్చలో సుధామూర్తి పాల్గొన్నారు. ప్రాథమిక, ఉన్నత పాఠశాలల పాఠ్యాంశాల్లో వందేమాతరాన్ని తప్పనిసరి చేయాలని ఆమె కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. దేశభక్తిని పెంపొందించడానికి, సాంస్కృతిక స్మృతిని కాపాడటానికి ఇది అవసరమని నొక్కి చెప్పారు. “భారత్ విభిన్న రంగులతో కూడిన దుప్పటి వంటిది. దాన్ని కలిపి ఉంచే దారం, సూది వందేమాతరం” అని ఆమె అభివర్ణించారు.

స్వాతంత్ర్య పోరాటంలో ఈ గీతం కీలక పాత్ర పోషించిందని గుర్తుచేశారు. ప్రజలు ఆత్మవిశ్వాసం కోల్పోయిన సమయంలో ‘వందేమాతరం’ ఒక అగ్నిపర్వతంలా విస్ఫోటనం చెందిందని, పిరికివారిని సైతం నిలబెట్టే శక్తి దానికి ఉందని వివరించారు. మనకు స్వాతంత్ర్యం వెండి పళ్లెంలో పెట్టి రాలేదని, ఎందరో త్యాగాలతో ముడిపడి ఉన్న ఆ పోరాటానికి వందేమాతరం ప్రతీక అని అన్నారు. వందేమాతరం గీతాన్ని రచించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పార్లమెంటులో ప్రత్యేక చర్చ చేపట్టారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |