UPDATES  

NEWS

 వైజాగ్‌కు గూగుల్ డేటా సెంటర్ తెచ్చిన లోకేశ్‌ను విమర్శిస్తారా?: వైసీపీపై యార్లగడ్డ ఫైర్

ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరియు మంత్రి నారా లోకేశ్‌ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తుంటే, వైసీపీ నేతలు విమర్శలు చేయడం దారుణమని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మండిపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నారా లోకేశ్‌ ఇటీవల అమెరికా పర్యటనలో గూగుల్, అడోబ్, ఎన్విడియా వంటి 18 ప్రపంచ దిగ్గజ కంపెనీలతో సమావేశమై రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నం చేశారని తెలిపారు.

లోకేశ్ సాధించిన విజయాన్ని యార్లగడ్డ ప్రత్యేకంగా ప్రస్తావించారు. “‘గూగుల్ మర్చిపోదు’ అన్న సినిమా డైలాగ్‌ను నిజం చేస్తూ, ₹15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో గూగుల్ డేటా సెంటర్‌ను వైజాగ్‌కు తీసుకొచ్చిన ఘనత లోకేశ్‌ది” అని ఆయన అన్నారు. అలాంటి వ్యక్తిని వైసీపీ నేతలు విమర్శించడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా అమెరికా వెళ్లి ఇలాంటి కంపెనీలతో సమావేశమయ్యారా అని బహిరంగంగా సవాల్ విసిరారు.

ఈ సందర్భంగా, యార్లగడ్డ మాజీ మంత్రి కొడాలి నానిపై కూడా తీవ్ర విమర్శలు చేశారు. గుడివాడ ప్రజలు ఓడించారనే కక్షతో నాని ఏడాది పాటు నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడలేదని ఆరోపించారు. అధికారం లేనప్పుడు ప్రజలకు సేవ చేయడమే గొప్పతనమని ఆయన గుర్తుచేశారు. వైసీపీ నేతలు బూతులు తిట్టడం మానుకుని, రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని, కనీసం గౌరవంగా అసెంబ్లీకి రావాలని యార్లగడ్డ సూచించారు. అక్రమ కేసుల కారణంగానే తాను లోకేశ్‌తో పాటు అమెరికా పర్యటనకు వెళ్లలేకపోయానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |