కేరళలోని మున్నార్ పంచాయతీ ఎన్నికల్లో ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పేరు కలిగిన అభ్యర్థి ఒకరు ఇక్కడి నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేత పేరు ఉన్నప్పటికీ, ఈ కేరళ సోనియా గాంధీ రాజకీయ ప్రయాణం ఆమెకు భిన్నంగా సాగుతోంది.
బీజేపీ అభ్యర్థి సోనియా గాంధీ తండ్రి, దివంగత దురే రాజ్ గతంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పనిచేసేవారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలిపై అభిమానంతో ఆయన తన కూతురుకు అదే పేరు పెట్టుకున్నారు. అయితే, కొన్నేళ్ల క్రితం ఈ సోనియా గాంధీకి బీజేపీ కార్యకర్త అయిన పంచాయతీ ప్రధాన కార్యదర్శి సుభాష్తో వివాహం జరిగింది. దీంతో భర్త మద్దతుతో ఆమె బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు.
మున్నార్ పంచాయతీ స్థానం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి మంజుల రమేశ్కు ఇది ఇబ్బందికరంగా మారింది. ప్రత్యర్థికి తమ పార్టీ అగ్రనేత పేరు ఉండటం వల్ల ఓటర్లు గందరగోళానికి గురయ్యే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. కేరళలో స్థానిక సంస్థల ఎన్నికలు డిసెంబర్ 9, 11 తేదీల్లో జరగనుండగా, డిసెంబర్ 13న ఫలితాలు వెలువడనున్నాయి.









