UPDATES  

NEWS

 దక్షిణ కోస్తాపై వాయుగుండం ప్రభావం: ఏపీఎస్డీఎంఏ హెచ్చరిక

బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో రానున్న రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) వెల్లడించింది. నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక, హిందూ మహాసముద్రం పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమైన ఈ అల్పపీడనం, ఉత్తర-వాయువ్య దిశగా కదులుతూ గురువారం నాటికి వాయుగుండంగా బలపడనుందని తెలిపింది. ఆ తర్వాత 48 గంటల్లో ఇది మరింత బలపడి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరాల వైపు పయనించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

దీని ప్రభావంతో గురువారం నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో గంటకు 35 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని ఏపీఎస్డీఎంఏ పేర్కొంది. అలాగే, శని, ఆదివారాల్లో కోస్తా, రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు, మలక్కా జలసంధి సమీపంలో ఏర్పడిన ‘సెన్యార్’ అనే తుపాను ఇప్పటికే ఇండోనేషియా వద్ద తీరం దాటినట్లు అధికారులు వివరించారు.

రానున్న రోజుల్లో భారీ వర్షాలు, బలమైన గాలుల ముప్పు ఉన్నందున, మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |