ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళిపై బీజేపీ నేత చికోటి ప్రవీణ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. “రాజమౌళీ, హిందువులు నీ సినిమాలు చూడకపోతే నీ బ్రతుకేమవుతుందో ఆలోచించుకో. నీ సినిమాలను నాస్తిక కుక్కలతోనే తీయాలి” అని తీవ్రంగా స్పందించారు. రాజమౌళి హిందూ సమాజానికి వెంటనే క్షమాపణ చెప్పాలని, లేదంటే హిందూ ద్రోహిగా మిగిలిపోతాడని ఆయన హెచ్చరించారు. హిందూ సమాజం ఆగ్రహిస్తే రాజమౌళి బతుకు హీరో నుంచి జీరో అవుతుందని చికోటి ప్రవీణ్ వ్యాఖ్యానించారు.
రాజమౌళి వ్యవహార శైలి “మదమెక్కిన ఏనుగు మురికి కాలువలో పడినట్లుగా” ఉందని చికోటి ప్రవీణ్ విమర్శించారు. రాజమౌళి అద్భుతమైన దర్శకుడు అనే ఉద్దేశంతో అందరూ అభిమానిస్తారని, కానీ ఒక్క ప్రకటనతో హిందూ సమాజంలో ఆయనపై వ్యతిరేకత వచ్చిందని అన్నారు. రాజమౌళి దేవుడిని నమ్మకుంటే తమకు వచ్చిన సమస్య ఏమీ లేదని, కానీ విమర్శించడం సరికాదని అన్నారు. దేవుడి కథలతో డబ్బులు సంపాదించాడని అందరూ చెబుతున్నారని, అందులో వాస్తవం ఉందని పేర్కొన్నారు.
అహంకారంతో విర్రవీగే భల్లాలదేవ చివరకు ఎలా పతనమయ్యాడో రాజమౌళి తీసిన బాహుబలి సినిమాలోనే చూపించారని, ఇప్పుడు రాజమౌళి అదే అహంకారంతో ప్రవర్తిస్తే పతనం ఖాయం అని చికోటి ప్రవీణ్ హెచ్చరించారు. “నీ సినిమాలకు కూడా నాస్తిక కుక్కలనే అనుమతించు” అని రాజమౌళికి సూచించారు. హిందువుల మనోభావాలను కించపరిచేలా ఎవరైనా ప్రవర్తిస్తే ఊరుకునేది లేదని ఆయన తీవ్ర హెచ్చరిక జారీ చేశారు.









