ఐబొమ్మ’ పైరసీ కేసులో అరెస్ట్ అయిన నిందితుడు ఇమ్మడి రవి తండ్రి అప్పారావు భావోద్వేగానికి లోనయ్యారు. తన కుమారుడు తప్పు చేశాడని అంగీకరిస్తూనే, రవికి తక్కువ శిక్ష పడేలా చూడాలని అధికారులకు కన్నీటితో విజ్ఞప్తి చేశారు. అప్పారావు మాట్లాడుతూ, “నా కొడుకు చేసింది తప్పే కావచ్చు. కానీ వాడికి ఒక కూతురు ఉంది. నా మీద దయతలిచి వాడిని స్టేషన్లో ఎక్కువగా ఇబ్బంది పెట్టొద్దని కోరుకుంటున్నాను,” అని తెలిపారు. ప్రస్తుతం తన ఆందోళన అంతా తన మనవరాలి భవిష్యత్తు గురించేనని, ఆమెను తలచుకుంటే గుండె తరుక్కుపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
అప్పారావు చట్టం ముందు అందరూ సమానమేనని, చట్టానికి జాలి, దయ వంటివి ఉండవని తనకు తెలుసని నిస్సహాయత వ్యక్తం చేశారు. తప్పు చేసిన వాళ్లంతా ఒక్కటేనని, తన మనవరాలి కోసం తన కొడుకును వదిలేయరని తనకు తెలుసని అన్నారు. ఈ సమయంలో తాను బాధపడటం తప్ప చేయగలిగింది ఏమీ లేదని ఆయన వాపోయారు. అంతేకాకుండా, ప్రస్తుతం తన కోడలు కూడా తనతో మాట్లాడటం లేదని ఆయన తెలిపారు.
‘ఐబొమ్మ’ వెబ్సైట్ ద్వారా కొత్త సినిమాలను పైరసీ చేస్తూ కోట్లాది రూపాయలు సంపాదించారన్న ఆరోపణల నేపథ్యంలో రవి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో విచారణ కొనసాగుతుండగా, రవి తండ్రి చేసిన ఈ భావోద్వేగపూరిత విజ్ఞప్తి టాలీవుడ్లో మరియు ప్రజల్లో చర్చనీయాంశమైంది.









