ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని, అందుకే కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి బీజేపీపై నిందలు వేస్తూ అసత్య ప్రచారం చేస్తున్నారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె. లక్ష్మణ్ ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి మాటల్లో ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొన్నారు. వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించేందుకే కాంగ్రెస్ బీజేపీపై నిందలు వేస్తోందని ఆయన ప్రశ్నించారు.
ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మణ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పలు ప్రశ్నలు సంధించారు. ఇంటికో ఉద్యోగం అంటూ బీహార్లో రేవంత్ రెడ్డి మిత్రుడు తేజస్వీ యాదవ్ ఇచ్చిన హామీ గురించి ప్రస్తావిస్తూ, ఏడు కోట్ల మంది ఉన్న ఆ రాష్ట్రంలో ఆ హామీ సాధ్యమేనా అని నిలదీశారు. అంతేకాకుండా, రేవంత్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ప్రజలకు ఇచ్చే బహుమతి ఏమిటో చెప్పాలని కూడా ఆయన డిమాండ్ చేశారు.
గతంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు చెట్టాపట్టాలు వేసుకుని అధికారాన్ని పంచుకున్నాయని డాక్టర్ లక్ష్మణ్ ఆరోపించారు. 20 శాతం ఓట్ల కోసం దిగజారి మాట్లాడితే, 80 శాతం ఉన్న ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమని హెచ్చరించారు. పాతబస్తీలో మజ్లిస్ పార్టీకి అవకాశమిస్తే, అది ఈరోజు విషనాగులా తయారైందని విమర్శించారు, ఈ పరిస్థితికి కాంగ్రెస్, బీఆర్ఎస్సే కారణమని పరోక్షంగా పేర్కొన్నారు.









