UPDATES  

NEWS

 కొత్త పార్టీ ప్రచారాన్ని ఖండించిన ఎమ్మెల్సీ కవిత: ‘జాగృతి జనం బాట’ ప్రజల సమస్యల కోసమే

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత, తాను కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నానంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. మార్చి లేదా ఏప్రిల్‌లో కొత్త పార్టీ స్థాపనకు సిద్ధమవుతున్నారనే వార్తలు తప్పుడు ప్రచారం అని ఆమె స్పష్టం చేశారు. ప్రస్తుతం తాను చేపట్టిన ‘జాగృతి జనం బాట’ కార్యక్రమం ఏప్రిల్ 13న ముగుస్తుందని, ఈ కార్యక్రమం రాజకీయ ప్రయోజనాల కోసం కాదని, ప్రజల సమస్యలను తెలుసుకోవడం, జాగృతిని బలోపేతం చేయడం ప్రధాన ఉద్దేశమని కవిత వివరించారు. ఈ నాలుగు నెలలు ప్రజల మధ్యలోనే ఉంటానని తెలిపారు.

ఈ సందర్భంగా, ఆదిలాబాద్‌లో మీడియాతో మాట్లాడిన కవిత, పత్తి రైతుల సమస్యలపై కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మూడు పార్టీల నిర్లక్ష్యాన్ని తీవ్రంగా విమర్శించారు. ఇటీవల వచ్చిన మొంథా తుపాను కారణంగా పత్తిలో తేమ శాతం పెరిగి రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లోని వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, పత్తిలో తేమ శాతాన్ని 20–25 శాతం వరకు అనుమతించాలని కేంద్ర మంత్రిని కోరనున్నట్లు ఆమె వెల్లడించారు.

అంతేకాకుండా, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం నిర్వీర్యం అవుతున్నదని, పేద విద్యార్థులు చదువును కొనసాగించలేకపోతున్నారని కవిత ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. ఫీజు సమస్యలపై ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు చేపట్టిన బంద్‌కు తెలంగాణ జాగృతి మద్దతు తెలుపుతుందని ఆమె ప్రకటించారు.

 

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |