భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం హర్యానాలోని అంబాలా ఎయిర్బేస్ నుండి రఫేల్ యుద్ధ విమానంలో ప్రయాణించి ఒక కొత్త చరిత్రను సృష్టించారు. రఫేల్ ఫైటర్ జెట్లో ప్రయాణించిన తొలి రాష్ట్రపతిగా ఆమె నిలిచారు. ఈ చారిత్రక ఘట్టం కేవలం ఒక అధికారిక ప్రయాణం మాత్రమే కాదు, ఈ సందర్భంగా రాష్ట్రపతి ముర్ముతో కలిసి ఫోటో దిగిన అధికారి.. దేశంలో మొట్టమొదటి మరియు ఏకైక మహిళా రఫేల్ ఫైటర్ పైలట్ స్క్వాడ్రన్ లీడర్ శివాంగి సింగ్.
వారణాసికి చెందిన శివాంగి సింగ్ 2017లో భారత వైమానిక దళం (IAF) లో చేరి, 2020లో రఫేల్ ఫైటర్ జెట్ పైలట్గా ఎంపికయ్యారు. ఆమె అంబాలాలోని ప్రసిద్ధ “గోల్డెన్ యారోస్ స్క్వాడ్రన్” లో భాగమై, పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత జరిగిన వైమానిక దాడుల్లో కీలక పాత్ర పోషించారు. అయితే, ఇటీవల పాకిస్తాన్ వైమానిక దళం (PAF) ‘ఆపరేషన్ సింధూర్’ సమయంలో భారత్ ఈ ఫైటర్ పైలట్ను బంధించిందని లేదా చంపేసిందని తప్పుడు ప్రచారం చేసింది.
పాకిస్తాన్ చేస్తున్న నిరాధారమైన ప్రచారానికి గట్టి జవాబుగా, భారత రాష్ట్రపతి సాక్షాత్తు శివాంగి సింగ్తో కలిసి కనిపించారు. అంతేకాకుండా, IAF కూడా ఈ ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తూ, శివాంగి సింగ్కు ప్రతిష్టాత్మకమైన “క్వాలిఫైడ్ ఫ్లయింగ్ ఇన్స్ట్రక్టర్ (QFI)” బ్యాడ్జ్ లభించిన విషయాన్ని వెల్లడించింది. వైమానిక దళం ఇచ్చిన ఈ గౌరవం మరియు రాష్ట్రపతి ఆమెతో ప్రయాణించడం ద్వారా, మహిళా గౌరవాన్ని కించపరిచే పాకిస్తాన్ ‘ప్రచార యుద్ధం’ నిరాధారమైన అబద్ధమని తేలిపోయింది.









