స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్కు తెలంగాణ హైకోర్టులో అడ్డంకులు తొలగిన నేపథ్యంలో, రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. నామినేషన్లు, శాంతిభద్రతలపై ఈసీ కీలక సూచనలు చేసింది. ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని కలెక్టర్లు ఈసీకి తెలియజేశారు. రేపు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయకుండా చూడాలని పిటిషనర్లు కోరగా, హైకోర్టు నిరాకరించింది.
ఏజీతో తెలంగాణ బీసీ మంత్రుల భేటీ
అడ్వోకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డితో తెలంగాణ బీసీ మంత్రులు సమావేశమయ్యారు. బీసీ రిజర్వేషన్లపై రేపు తుది విచారణ ఉన్న నేపథ్యంలో హైకోర్టులో వ్యవహరించాల్సిన అంశాలపై చర్చించారు. కోర్టు తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగానే ఉంటుందని మంత్రులు ధీమా వ్యక్తం చేశారు. నేడు హైకోర్టులో జరిగిన వాదనలపై మంత్రులు సమీక్ష నిర్వహించారు. న్యాయస్థానంలో బలమైన వాదనలు వినిపించారంటూ న్యాయవాదులను అభినందించారు.









