ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏపీ అభివృద్ధి పైన దృష్టి సారిస్తూనే, మరోవైపు స్వచ్ఛతకు కూడా పెద్దపీట వేస్తూ పలు కార్యక్రమాలను చేపడుతుంది. కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్వచ్ఛభారత్ మిషన్ అమలులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్ గా మార్చాలని ఏపీ ప్రభుత్వం సంకల్పించింది. ప్రధాని మోదీ లక్ష్యాన్ని సాకారం చేసేలా సీఎం చంద్రబాబు అడుగులు వేస్తున్నారు.
ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం
దీనికోసం ఇప్పటికే తడి చెత్త, పొడి చెత్త తో పాటు ఇంట్లో ఉన్న పాత సామాన్లను గ్రామపంచాయతీ సిబ్బందికి ఇస్తే వాటికి ధర కట్టి వాళ్లకు కావలసిన కూరగాయలు, నిత్య అవసరాలు ఇవ్వడానికి రంగం సిద్ధం చేశారు. ప్రతి ఒక్కరిలోనూ స్వచ్ఛతపై అవగాహన కలిగించడానికి ఈ తరహా ప్రయత్నాన్ని చేయాలనుకుంటున్న ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం కూడా తీసుకుంది.
రాష్ట్రవ్యాప్తంగా నగరాలు, పట్టణాలు, గ్రామాలను పరిశుభ్రంగా మార్చే పనిలో ఉన్న ప్రభుత్వం స్వచ్చాంధ్ర అవార్డులను ప్రధానం చేయాలని సంకల్పించింది. ఈ స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగంగా పారిశుధ్యం పైన వివిధ శాఖల వారీగా సేకరించిన రిపోర్టుల ఆధారంగా అవార్డులను ఎంపిక చేసి రాష్ట్ర స్థాయిలోనూ, జిల్లా స్థాయిలోను విశేషంగా కృషి చేసిన వారిని గుర్తించి వారికి ప్రభుత్వం అవార్డులను ఇవ్వాలని నిర్ణయించింది.
13 కేటగిరీలలో అవార్డులు
ఈ నిర్ణయంతో క్షేత్రస్థాయిలో పరిశుభ్రతను ప్రోత్సహించి అందులో చురుకుగా పాల్గొన్న వారిని గుర్తించనుంది. తద్వారా వారిని మరింత ప్రోత్సహించాలనే ఉద్దేశంలో ప్రభుత్వం ఉంది. ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం మొత్తం 13 కేటగిరీలలో ఇచ్చే ఈ అవార్డులలో ఎన్జీవోలు, స్వచ్ఛ రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా ఉన్నాయి. మహాత్మా గాంధీ జయంతి అయిన అక్టోబర్ 2వ తేదీన ఈ అవార్డులను ప్రదానం చేయాలని భావిస్తున్నది ఏపీ ప్రభుత్వం.









