ఎమ్మెల్యే కొలికపూడి వివాదం కొత్త మలుపు తీసుకుంది. ఊహించని పరిణామాలు చోటు చేసుకుం టున్నాయి. పార్టీ నేత రమేశ్ రెడ్డి పై నాయకత్వం చర్యలు తీసుకోకుంటే రాజీనామా చేస్తానంటూ కొలికపూడి 48 గంటల డెడ్ లైన్ విధించారు. ఈ గడువు ముగిసింది. దీంతో, కొలికపూడి వివాదం పార్టీ రాష్ట్ర కార్యాలయానికి చేరింది. కొలికపూడి అంశం పైన ఇప్పటికే ముఖ్య నేతల నుంచి పార్టీ అభిప్రాయాలు సేకరించింది. అటు కొలికపూడితోనూ మాట్లాడారు. దీంతో, ఇప్పుడు ఈ వ్యవహారం లో ఆసక్తి కర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
టీడీపీలో కొలికపూడి వ్యవహారం రచ్చగా మారుతోంది. పార్టీ నేత రమేశ్ రెడ్డి పైన 48 గంటల్లో చర్య లు తీసుకోక పోతే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని కొలికపూడి ప్రకటించారు. దీంతో, పార్టీ అప్రమత్తం అయింది. కొలికపూడి శైలి ప్రతీ సారి వివాదాస్పదం అవుతుండటంతో పార్టీ ముఖ్య నేతల నుంచి అభిప్రాయ సేకరణ చేసింది. ఇటు కొలికపూడి రాజీనామా చేస్తే.. ఆయన స్థానంలో నియోజకవర్గం బాధ్యతలు దేవదత్ కు అప్పగించేందుకు రంగం సిద్దమైంది. ఇదే సమయంలో కొలికపూడి యూ టర్న్ తీసుకున్నారు. రాజీనామా నిర్ణయం నుంచి వెనక్కు తగ్గారు. అయినా.. ఇప్పుడు నేరుగా విజయవాడ ఎంపీ పైన గురి పెట్టినట్లు తెలుస్తోంది.
ఇక, ఇటు కొలికపూడి వ్యవహారం బాధ్యతలను మంత్రి అచ్చెన్నాయుడుకు అప్పగించారు. ఈ రోజు లేదా రేపు అచ్చెన్నాయుడు ఈ వివాదం పైన చర్చలు చేసి.. పరిష్కారం చూపించే అవకాశం కనిపి స్తోంది. దీంతో, అచ్చెన్నాయుడు తో తాను అన్ని విషయాలు చర్చిస్తానని చెప్పిన కొలికపూడి.. ఆయన నిర్ణయమే ఫైనల్ అని స్పష్టం చేసారు. ఇటు.. కొలికపూడి ఆరోపించిన రమేశ్ రెడ్డి ఎంపీ కేశినేని చిన్ని తో సమావేశం కావాలని నిర్ణయించారు. ఎంపీ చిన్ని పైన కొలికపూడి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎంపీ తీరుతోనే వివాదాలు వస్తున్నాయని కొలికపూడి చెబుతున్నట్లు తెలుస్తోంది. దీంతో, అచ్చెన్నాయుడు ఈ వివాదం లో చర్చల తరువాత ఇచ్చే నివేదిక ఆధారంగా కొలికపూడి పైన చర్యలు ఉండే అవకాశం కనిపిస్తోంది.









