ఏపీలో కూటమి ఎన్నికల్లో ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంపై త్వరలోనే శుభవార్త అందిస్తామని రవాణామంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఇవాళ వెల్లడించారు. ఇప్పటికే ప్రభుత్వం దీనిపై అధ్యయనం చేస్తోందన్నారు. త్వరలోనే దీనిపై మహిళలకు శుభవార్త చెప్తామన్నారు. చిత్తూరు ఆర్టీసీ డిపోలో 17 కొత్త బస్సుల్ని ప్రారంభించిన సందర్భంగా మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.
గత ఐదేళ్లలో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిర్వీర్యమైందని, కానీ చంద్రబాబు సీఎం అయ్యాక సుమారు 1400 బస్సులు ఏపీఎస్ఆర్టీసీ పరిధిలోకి వచ్చాయని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. సుమారు 400 బస్సులు రోడ్ల మీదికి వచ్చాయన్నారు. ఏ ఉద్దేశ్యంతో ఏపీఎస్ఆర్టీసీని స్థాపించారో దాన్ని నెరవేర్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఇచ్చిన హామీలన్నింటినీ సక్రమంగా ప్రజలకు అందే విధంగా ముఖ్యమంత్రి చర్యలు చేపడుతున్నారని మంత్రి పేర్కొన్నారు.
రాష్ట్ర రవాణా సంస్థ (ఆర్టీసీ) ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉందని, మన జీవనంలో ఆర్టీసీ బస్సు ఒక భాగం అని, కుగ్రామాలకు కూడా ఆర్టీసీ బస్సులు వెళ్తున్నట్లు మంత్రి గుర్తుచేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలలో ముఖ్యంగా మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని అతి త్వరలోనే మహిళామూర్తులకు ఒక శుభవార్త చెబుతామని తెలిపారు. అలాగే వచ్చే ఐదేళ్లలో రాష్ట్రంలో ఎక్కడ చూసినా విద్యుత్ తో నడిచే బస్సులను తీసుకొస్తామన్నారరు.









