తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్తున్న ప్రభుత్వం, తాజాగా వైద్య రంగానికి ప్రాధాన్యతనిస్తున్నామని, ప్రజల ఆరోగ్యం కోసం కీలక నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. తాజాగా రేవంత్ రెడ్డి కలెక్టర్ల సమావేశంలో రాష్ట్ర ప్రజల ఆరోగ్యం కోసం తీసుకున్న కీలక నిర్ణయాన్ని వెల్లడించారు.
రేషన్ కార్డులతో సంబంధం లేకుండా ఆరోగ్య శ్రీ కార్డులు కలెక్టర్లతో సమావేశంలో రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న అనేక కీలక నిర్ణయాలపై దిశా నిర్దేశం చేశారు. రాష్ట్రంలో అందరికీ ఆరోగ్యశ్రీ కార్డులు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రేషన్ కార్డుతో దీనికి లింకు పెట్టకుండా ఆరోగ్యశ్రీ కార్డులు ఇవ్వాలని సూచించారు. ఇదే సమయంలో ప్రతి ఒకరి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలని సచివాలయంలో కలెక్టర్లతో సమావేశంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి సూచించారు.
వైద్య వ్యవస్థపై కలెక్టర్ లకు రేవంత్ రెడ్డి దిశా నిర్దేశం ఆర్ఎంపీలు, పీఎంపీలు ఇబ్బందులను తొలగించేలా రూరల్ వైద్యులను ప్రోత్సహించేలా ఎక్కువ పారితోషకం ఇవ్వాలని పేర్కొన్నారు.అంతే కాదు ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రతి బెడ్ కు సీరియల్ నెంబర్లు ఉండేలా చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. గిరిజనులకు సరైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆసుపత్రిలో మెయింటెనెన్స్ కోసం ప్రత్యేక వ్యవస్థ ఉండేలా కలెక్టర్లు చూడాలని కలెక్టర్లకు రేవంత్ రెడ్డి దిశా నిర్దేశం చేశారు.
కలెక్టర్ లకు రేవంత్ దిశా నిర్దేశం ఇదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న అనేక నిర్ణయాలపై కలెక్టర్లతో మాట్లాడిన రేవంత్ రెడ్డి కలెక్టర్లు తెలంగాణను సొంత రాష్ట్రంగా భావించి పనిచేయాలన్నారు. ప్రజలకు ప్రయోజనం చేకూరేలా మానవీయ కోణంలో నిర్ణయాలు ఉండాలని, క్షేత్రస్థాయిలో ప్రజలకు కలెక్టర్లు అందుబాటులో ఉండాలని సూచించారు.
ప్రజాహిత పాలన అందించాలన్న రేవంత్ ఆరు గ్యారెంటీలను పారదర్శకంగా అమలు చేసే బాధ్యత కలెక్టర్ల పైనే ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన అందిస్తున్న ప్రజా ప్రభుత్వం అని ప్రజలకు విశ్వాసం కలిగేలా చూడాలని రేవంత్ రెడ్డి కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. మీ ప్రతీ చర్య ఇది ప్రజా ప్రభుత్వం అని ప్రజలకు తెలిసేలా ఉండాలన్నారు. ఈ ప్రజా ప్రభుత్వంలో పారదర్శక ప్రజాహిత పాలన అందించాలని సూచించారు. సంక్షేమం, అభివృద్ధిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళాల్సిన బాధ్యత మీపైనే ఉందని రేవంత్ కలెక్టర్ లకు సూచించారు.









