2019 ఎన్నికల్లో 151 సీట్లలో ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చిన వైసీపీ.. తీవ్ర ప్రజాగ్రాహానికి లోనై 2024 ఎన్నికల్లో కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. 2019 ఎన్నికల్లో 22 పార్లమెంట్ స్థానాలకు గెలుచుకున్న ఆ పార్టీ ఈసారి నాలుగు పార్లమెంట్ స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. ప్రభుత్వ వ్యతిరేకత, ప్రజా ఆగ్రహంతో వైసీపీ కంచుకోటలు కూడా బద్దలైయ్యాయి.
ఊహించని రీతిలో వైసీపీ ఓటమి పాలుకావడం అందర్ని ఆశ్చర్యానికి గురి చేసింది. పార్టీ దారుణంగా ఓడిపోవడంతో జగన్ సైతం పూర్తి నిరాశలో కూరుకుపోయారు.అసలు జగన్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడానికి అసెంబ్లీకి వస్తారా అనే అనుమానం వ్యక్తం చేశారు. అందరి అనుమానాలను తలక్రిందులు చేస్తూ జగన్ తొలిరోజు అసెంబ్లీకి హాజరై, ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు.
మరి కొద్దిరోజుల్లో బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. దీంతో జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకారని కూటమి నేతలు ఎద్దెవా చేస్తున్నారు. ఈక్రమంలో దీనిపై వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పేర్ని నాని క్లారిటీ ఇచ్చారు. మంగళవారం తాడేపల్లి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..ఓ ఎమ్మెల్యేగా జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారని ఆయన తెలిపారు.
పార్టీకి చెందిన 11 మంది కూడా బడ్జెట్ సమావేశాలకు వెళ్తారని పేర్ని నాని చెప్పుకొచ్చారు. అసెంబ్లీ సమావేశాల్లో మా వ్యూహాలు మాకున్నాయని పేర్ని నాని స్పష్టం చేశారు. పూర్తిస్థాయిలో బడ్జెట్ను ప్రవేశపెట్టలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని పేర్ని నాని ఎద్దెవా చేశారు. దీంతో జగన్ అసెంబ్లీకి వెళ్తారా లేదా అన్న ఉత్కంఠకు పేర్ని నాని తెర దించారు. ఈ నెల 22 నుంచి బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. అయితే జగన్కు ప్రతిపక్ష హోదా కూడా లేకపోవడంతో ఆయన సాధారణ ఎమ్మెల్యేగానే అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు.
అసెంబ్లీలో జగన్ ఎలాంటి వ్యూహాలను అమలు చేస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. హామీల అమలుపై జగన్ ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ఇసుకు , తల్లికి వందనం, విద్యుత్ ఛార్జీలు పెంచు వంటి అంశాలపై ప్రభుత్వాన్ని జగన్ ప్రశ్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రతి మహిళకు రూ 1500 ఎప్పటి నుంచి అమలు చేస్తారని కూటమిని నిలదీయడానికి జగన్ సిద్దమవుతున్నారు. ఇదే సమయంలో ఆయనకు తగినంత సమయం ఇస్తారా అనే ప్రశ్న సైతం ఉత్పన్నం అవుతోంది. ఏది ఏమైనప్పటికి జగన్ అసెంబ్లీకి వెళ్లనుండటం ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకుంది.