ఏపీలో గత వైసీపీ పాలనలో జరిగిన అక్రమాలపై వరుసగా శ్వేతపత్రాలు విడుదల చేస్తున్న సీఎం చంద్రబాబు ఇవాళ మరో అంశంపై గణాంకాల సహా వివరాలు ఇచ్చారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో సహజ వనరుల విధ్వంసం, దోపిడీ ఎలా జరిగిందో వివరిస్తూ ఇవాళ సచివాలయంలో మరో శ్వేతపత్రం విడుదల చేశారు. ఇందులో వైసీపీ నేతలు రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఎలా దోపిడీ చేశారో వెల్లడించారు. ఇవన్నీ ఇప్పటికే టీడీపీ సహా కూటమి పార్టీల నేతలు ఆరోపిస్తున్నవే.
అటవీ, సహజ వనరుల, భూమి, గనుల వ్యవహారంపై ఇవాళ సీఎం చంద్రబాబు శ్వేత పత్రం విడుదల చేశారు. గత ప్రభుత్వ హయాంలో వీటన్నిటి పైనా దోపిడీ ధ్వంసం జరిగిందని ఆయన తెలిపారు. రికార్డుల్లో అన్ని దొరకలేదన్నారు. క్షేత్ర స్థాయిలో మరింత లోతుగా తవ్వితే తప్ప ఈ దోపిడీ ఎంత జరిగిందో చెప్పలేమన్నారు. 2019-24 మధ్య పెద్ద ఎత్తున భూ కబ్జాలు జరిగినట్లు చంద్రబాబు ఆరోపించారు. విశాఖ, ఒంగోలు, తిరుపతి, చిత్తూరుల్లో జరిగిన భూ దోపిడీ లు ఒక ఉదాహరణ మాత్రమే అన్నారు.
ఇళ్ల పట్టాల పేరిట భారీ స్థాయిలో దోపిడీ జరిగిందని చంద్రబాబు ఆరోపించారు. అక్రమంగా పార్టీ కార్యాలయాల కోసం భూమి దోచేశారన్నారు. అనర్హులు అయిన వారికి భూ కేటాయింపు జరిగిందన్నారు. విశాఖ లో రామానాయుడు స్టూడియో లో అనధికారికంగా ఇళ్ల పట్టాలు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ హయగ్రీవ పేరిట కోట్ల విలువైన భూమి కొట్టేశారని చంద్రబాబు ఆరోపించారు.
శారదా పీఠం కు కోట్లు విలువ చేసే భూమి ఎకరా లక్షకు కేటాయించారని చంద్రబాబు ఆక్షేపించారు. మాజీ ఎంపీ ఏంవివి కి చెందిన కంపెనీలకు కోట్ల రూపాయలు భూములు ఇచ్చేశారన్నారు. ఒంగోలులో 101 కోట్ల రూపాయల ఆస్తినీ నకిలీ డాక్యుమెంట్ లతో కాజేసారన్నారు. తిరుపతి లో మఠం భూములు ను 22ఏ లో పెట్టీ వైసీపీ వాళ్లు కొట్టేశారన్నారు. విలువైన 70 ఎకరాల వరకూ భూమిని 22 ఏ లో పెట్టీ దోచేశారన్నారు.
చిత్తూరు లో 982 ఎకరాల భూమిని రైత్వారీ పట్టాల ద్వారా వైసీపీ నాయకులు కొట్టేశారని చంద్రబాబు ఆరోపించారు. పుంగనూరు లో ఓ బడా నేత అధీనం లో రైత్వారీ పట్టాల ద్వారా కొట్టేశారన్నారు. ఇళ్ల పట్టాల ద్వారా 3 వేల కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగాయన్నారు. ఎస్సీ ఎస్టీల నుంచి 10 వేల ఎకరాల అసైన్డ్ భూములను ఇళ్ల పట్టాల కోసం లాక్కున్నారని ఆరోపించారు.అవ భూములు, అటవీ భూములు ఇళ్ల పట్టాల కోసం ఇచ్చి నివాస యోగ్యం కానీ చోట్ల ఇచ్చారన్నారు.