ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి రావడంతో అమరావతి రాజధానికి తిరిగి ప్రాణం పోసినట్లయింది. ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వం పూర్తిగా పక్కనబెట్టేసిన అమరావతి రాజధానిలో పనులు మళ్లీ ప్రారంభమయ్యాయి. అయితే ప్రస్తుతం నిధుల కొరత వేధిస్తున్నా ఏదో విధంగా సర్దుబాటు చేసి గతంలో మొదలుపెట్టిన నిర్మాణాలను పునఃప్రారంభించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అయితే రాజధానిపై న్యాయపరమైన చిక్కులపై ఇంకా ఫోకస్ పెట్టడం లేదు.
అమరావతి స్ధానంలో మూడు రాజధానుల్ని తెరపైకి తెచ్చిన వైసీపీ ప్రభుత్వం అందుకు అనుగుణంగా వేగంగా పావులు కదుపుతున్న తరుణంలో స్థానిక రైతులు ఉద్యమానికి తెరదీశారు. అదే సమయంలో హైకోర్టులో భారీగా పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన హైకోర్టు.. అమరావతే రాజధాని అని తేల్చిచెప్పేసింది. ఈ తీర్పు రాకముందే రాజధాని బిల్లుల్ని అసెంబ్లీలో జగన్ సర్కార్ వెనక్కి తీసుకుంది. ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కానీ అక్కడా రాజధాని వ్యవహారం ఇప్పటికీ తేలలేదు.
ఈ నేపథ్యంలో కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే సుప్రీంకోర్టులో కేసులు వెనక్కి తీసుకుంటుందని అంతా భావించారు. కానీ అలా జరగడం లేదు. ప్రభుత్వం అధికారం చేపట్టి నెల రోజులు గడుస్తున్నా సుప్రీంకోర్టులో గత ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లు వెనక్కి తీసుకోవడంపై ఎక్కడా చర్చ జరగడం లేదు.
అలాగే అసెంబ్లీలో రాజధాని బిల్లులు తిరిగి ప్రవేశపెడతామని కూడా ప్రభుత్వం చెప్పడం లేదు. దీంతో న్యాయపరమైన వివాదాలు పట్టించుకోకుండా ప్రభుత్వం పనులతో ముందుకెళ్లిపోవాలని నిర్ణయించుకుందా అన్న చర్చ జరుగుతోంది. లేకపోతే ఎలాగూ ఈ ఐదేళ్లూ తమ ప్రభుత్వమే ఉంటుంది కాబట్టి రాజధాని న్యాయ వివాదాల విషయంలో కాస్త ఆలస్యమైనా పర్వాలేదనే భావనలో ఉందో తెలియని పరిస్ధితి.