ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. శాసన మండలిలో ఖాళీ అయిన రెండు స్థానాల ఎంపికపై కసరత్తు పూర్తి చేసింది. అభ్యర్థులను ఖరారు చేసింది.
ఈ రెండూ కూడా ఎమ్మెల్యేల కోటాకు చెందినవే. అసెంబ్లీలో పూర్తిస్థాయి మెజారిటీ ఉండటం వల్ల అవి టీడీపీ, జనసేన ఖాతాలో పడటం ఖాయం. పోటీ పడే అవకాశం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు. ఫలితంగా ఈ రెండు స్థానాల్లో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎన్నిక ఏకగ్రీవం కావడం లాంఛనప్రాయమే అవుతుంది.
వైఎస్ఆర్సీపీకి చెందిన సీ రామచంద్రయ్య, ఇక్బాల్.. తమ సభ్యత్వానికి రాజీనామా చేయడం వల్ల ఈ రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి. ఎన్నికలు అనివార్యం అయ్యాయి. తెలుగుదేశం పార్టీ తరఫున మాజీ ఎమ్మెల్సీ సీ రామచంద్రయ్య మళ్లీ మండలికి ఎంపికయ్యారు. మొన్నటి వరకూ ఆయన అదే శాసన మండలిలో వైఎస్ఆర్సీపీ సభ్యుడిగా కొనసాగారు.
ఎన్నికలకు కొద్దిరోజుల ముందు పార్టీని వీడారు. టీడీపీ కండువాను కప్పుకొన్నారు. తన సభ్యత్వానికి రాజీనామా చేసి మరీ పార్టీలో చేరినందున చంద్రబాబు మళ్లీ ఆయననే నామినేట్ చేశారు. దీనితో- మొన్నటి వరకు వైఎస్ఆర్సీపీ సభ్యుడిగా శాసన మండలిలో కొనసాగిన సీ రామచంద్రయ్య.. ఇప్పుడు టీడీపీ సభ్యుడిగా అడుగుపెట్టనున్నారు.
ఇక్బాల్ రాజీనామా వల్ల ఖాళీ అయిన స్థానానికి జనసేన సీనియర్ నాయకుడు పిడుగు హరిప్రసాద్ నామినేట్ అయ్యారు. ప్రస్తుతం ఆయన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ రాజకీయ వ్యవహారాల కార్యదర్శిగా ఉంటోన్నారు. హరిప్రసాద్.. సీనియర్ జర్నలిస్ట్. జనసేనలో జాయిన్ కావడానికి ముందు దినపత్రికలు, న్యూస్ ఛానళ్లల్లో పని చేశారు.
సీ రామచంద్రయ్య, హరిప్రసాద్.. ఇద్దరూ కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్లే. నేడు వాళ్లిద్దరూ తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు. ఈ నెల 12వ తేదీన ఎన్నికలు షెడ్యూల్ అయ్యాయి. వీరిద్దరి ఎన్నిక దాదాపుగా ఏకగ్రీవం అయ్యే అవకాశాలు లేకపోలేదు.









