ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పాలనా పరంగా సమస్యల పరిష్కారానికి అడుగులు వేస్తున్నారు. ఈ నెల 4న ఢిల్లీలో ప్రధానితో చంద్రబాబు భేటీ కానున్నారు. ఏపీకి సంబంధించి పెండింగ్ అంశాల పైన చర్చించనున్నారు. ఆ వెంటనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ తో సమావేశానికి ప్రతిపాదించారు. రేవంత్ అంగీకరించారు. ఈ నెల 6న హైదరాబాద్ వేదికగా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరగనుంది.
ఇద్దరు సీఎంల భేటీ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీకి రంగం సిద్ధమైంది. ఈ నెల 6న హైదరాబాద్లోని ప్రజాభవన్లో ఈ సమావేశం జరగనుంది. ఏపీ సీఎం చంద్రబాబు దీనిపై స్వయంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు పూర్తయిన సందర్భంలో సంబంధిత అంశాలపై ముఖాముఖి చర్చించుకుందామని ప్రతిపాదించారు. ఇందుకు రేవంత్ కూడా అంగీకరించారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం అధికారికంగా ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు.
చంద్రబాబు ప్రతిపాదన ఈ సమావేశానికి ముఖ్యమంత్రులతోపాటు రెండు రాష్ట్రాల నుంచి ఇద్దరు చొప్పున సీనియర్ మంత్రులు, సంబంధిత అంశాలకు సంబంధించిన సీనియర్ అధికారులు కూడా హాజరవుతారు. ఉమ్మడి రాష్ట్ర విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన విభజన చట్టంలో పేర్కొన్న కొన్ని అంశాలు రెండు రాష్ట్రాల మధ్య ఇంకా అపరిష్కృతంగా ఉండిపోయాయి. ఉమ్మడి సంస్థల మధ్య ఆస్తుల విభజన కూడా పూర్తికాలేదు. ఈ భేటీకి ముందు చంద్రబాబు రెండు రోజులపాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఆ సమయంలో ఈ అపరిష్కృత సమస్యల గురించి కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకురానున్నారు.
ముహూర్తం ఖరారు చంద్రబాబు, రేవంత్ ముఖ్యమంత్రుల హోదాలో సమావేశం కావడం ఇదే మొదటిసారి. రేవంత్ గతంలో చంద్రబాబు నాయకత్వంలో టీడీపీలో పనిచేశారు. ఆ తర్వాత ఆ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరారు. ఆ పార్టీ నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రేవంత్కు ఆహ్వానం అందినా… ఆ కార్యక్రమాన్ని ఎన్డీయే కూటమి కార్యక్రమంగా నిర్వహించడంతో ఆయన రాలేదు. అధికారికంగా రెండు రాష్ట్రాల మధ్య ఒక సమావేశాన్ని నిర్వహించాలన్న ఆలోచన ఇటీవల ఇరువైపులా వచ్చింది. దాని ఫలితమే ఈ సమావేశమని చెబుతున్నారు. ఈ బేటీలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల చర్చలు..నిర్ణయాల పైన ఆసక్తి నెలకొంది.









