టీటీడీలో ప్రక్షాళన మొదలైంది. గత అయిదేళ్ల కాలంలో తీసుకున్న వివాదాస్పదన నిర్ణయాలు..దర్శనాల పేరుతో వసూళ్లు..అక్రమాల పైన విచారణ ప్రారంభించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత చంద్రబాబు శ్రీవారిని దర్శించుకొని కీలక నిర్ణయం ప్రకటించారు. టీటీడీ నుంచే ప్రక్షాళన ప్రారంభిస్తామని చెప్పారు. ఇప్పుడు ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానంలో చోటు చేసుకున్న అక్రమాలపై టీటీడీ చర్యలు చేపట్టింది.
విచారణ మొదలు టీటీడీలో గత ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న అక్రమాల పై విచారణ మొదలు పెట్టారు. ఇంజనీరింగ్ విభాగంలో చేపట్టిన నిర్మాణాలు, శ్రీవాణి ట్రస్టు నిధుల వినియోగం, వీఐపీ టికెట్ల కేటాయింపులో అవకతవకలపై విజిలెన్స్ అధికారులు పూర్తి స్ధాయి విచారణ చేపట్టారు. రాష్ట్ర విజిలెన్స్ విభాగం అధికారులు గోప్యంగా దస్త్రాల పరిశీలన సాగిస్తున్నారు. గడిచిన 5 సంవత్సరాల కాలంలో టీటీడీలోని ఐదు అంశాలపై అక్రమాలు నిగ్గు తెల్చేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు. నిధుల వివరాల సేకరణతో పాటుగా ఇంజనీరింగ్ పనులు అప్పగింత పైన సమాచారం సేకరిస్తున్నారు.
రంగంలోకి విజిలెన్స్ అదే సమయంలో ఆర్జిత సేవ, వీఐపీ బ్రేక్ దర్శన టికెట్ల కేటాయింపు, ఇంజనీరింగ్ విభాగంలో వందల కోట్ల రూపాయల నిధుల వ్యయం, శ్రీవాణి ట్రస్టు టికెట్ల అమ్మకాలు, తిరుమలలో వసతి గృహల ఆధునికీకరణపై రాష్ట్ర విజిలెన్స్ విభాగం దృష్టి సారించింది. శ్రీవాణి ట్రస్టు ద్వారా దర్శన టికెట్లు కేటాయించి సమకూరిన నిధుల వినియోగంపై విజిలెన్స్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. శ్రీవాణి ట్రస్టు నిధులతో ఆలయాల నిర్మాణం, పురాతన ఆలయాల పునరుద్దరణ పనులపై ఆరా తీస్తున్నారు. వైఎస్సార్సీపీ పాలనలో తిరుమలలో భక్తుల వసతి గృహల ఆధునికీకరణ పేరుతో కోట్ల రూపాయల నిధులు వ్యయం చేయడంపైనా విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు.
దస్త్రాల పరిశీలన వరాహస్వామి అతిథి గృహం, నారాయణగిరి వసతి గృహలతో పాటు సాధారణ భక్తులకు కేటాయించే వసతి గృహల ఆధునికీకరణ కోసం కేటాయించిన నిధుల వివరాలను సేకరిస్తున్నారు. తిరుమలలో డోనేషన్ విధానంలో కాటేజీల కేటాయింపులో చోటు చేసుకున్న అక్రమాలను గుర్తించే దిశగా చర్యలు ప్రారంభించారు. నిత్యాన్నదానం, లడ్డు ప్రసాదాల తయారీకి అవసరమైన ముడిసరుకుల కొనుగోలు, తదితర అంశాలపై దస్త్రాలను పరిశీలిస్తున్నారు. మరోవైపు తిరుపతిలో గోవిందరాజస్వామి సత్రాలను కూల్చి వేసి 460 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణాలు చేపట్టిన వసతి గృహల టెండర్లు, తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.









