ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అధికారం చేపట్టాక వరుస నిర్ణయాలతో ప్రజల్లోకి వెళ్తున్నారు. గత ప్రభుత్వం అమలు చేసిన పలు పథకాల పేర్లను మార్పు చేసారు. అదే విధంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పుడు తాజాగా వైఎస్సార్ రైతు భరోసా పథకం పేరును అన్నదాత సుభీభవగా మార్చారు. రైతులకు ఇచ్చే పెట్టుబడి సాయం పైన నిర్ణయం తీసుకున్నారు.
పథకం పేరు మార్పు ఏపీ ప్రభుత్వం మరో నిర్ణయం ప్రకటించింది. వైఎస్ఆర్ రైతు భరోసా పేరును అన్నదాత సుఖీభవగా మార్చారు. దీనికి అనుగుణంగా ప్రభుత్వ వెబ్ సైట్లో మార్పులు చేశారు. అన్నదాత సుఖీభవ వెబ్ సైట్లో సీఎం చంద్రబాబు నాయుడు, వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఫోటోలను ఉంచారు. అయితే అన్నదాత సుఖీభవ పథకాన్ని 2019లోనే చంద్రబాబు ప్రభుత్వం తీసుకువచ్చింది. తాము అధికారంలోకి వస్తే రైతులకు ఏటా రూ.20వేలు అందిస్తామని టీడీపీ అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు ‘సూపర్సిక్స్’లో ప్రకటించారు.
రైతులకు పెట్టుబడి సాయం దీనిపై త్వరలో విధి విధానాలతో అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో గత ప్రభుత్వం వ్యవసాయశాఖ ద్వారా రైతులకు అమలు చేసిన మరికొన్ని పథకాల పేర్లు కూడా మార్చాలని ప్రస్తుత ప్రభుత్వం నిర్ణయించింది. ‘వైఎస్సార్ సున్నావడ్డీ పంట రుణాల’ పేరును ‘వడ్డీలేని రుణాలు’గా, వైఎస్సార్ ఉచిత పంటల బీమాను ‘ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన’గా మార్చారు. ఈ మేరకు ‘అన్నదాత సుఖీభవ’ పథకం ద్వారా రైతులకు పెట్టుబడి సాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
పథకం అమలు దిశగా 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం.. వైఎస్ఆర్ రైతు భరోసా కింద రైతులకు పెట్టుబడి సాయం అందిస్తూ వచ్చింది. పీఎం కిసాన్ యోజన కింద అందించే రూ.6000లతో పాటుగా వైసీపీ ప్రభుత్వం రూ.7500 లు కలిపి ఏడాదికి రూ.13,500లను రైతులకు అందిస్తూ వచ్చారు. ఈ మొత్తాన్ని ఏడాదిలో మూడు విడతలుగా అందిస్తూ వచ్చారు. వైఎస్ఆర్ రైతు భరోసా పేరును అన్నదాత సుఖీభవగా మార్చిన నేపథ్యంలో.. ఈ పథకం అమలుపైనా త్వరలోనే నిర్ణయం ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.









