తెలంగాణ మాజీ సీఎం, భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధ్యక్షుడు కేసీర్ (KCR) సోమవారం హైకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో రైల్ రోకో సందర్భంగా తనపై నమోదైన కేసు విషయంలో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ప్రజాప్రతినిధుల కోర్టులో తనపై ఉన్న కేసును కొట్టివేయాలని హైకోర్టును కోరారు.
తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో భాగంగా 2011 అక్టోబర్లో రైల్ రోకోకు కేసీఆర్ పిలుపునిచ్చారంటూ మల్కాజిగిరి పోలీసులు కోర్టుకు నివేదిక సమర్పించారు. దీంతో పలు రైళ్ల రాకపోకలకు, రైల్వే ఉద్యోగులకు ఆటంకం కలిగించారని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన కేసీఆర్.. తాను ఎలాంటి రైల్ రోకోకు పిలుపునివ్వలేదని పిటిషన్లో తెలిపారు.
ఎవరో ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కేసులు నమోదు చేశారని కేసీఆర్ పేర్కొన్నారు. రైల్ రోకో ఘటన తర్వాత మూడేళ్లకు తెలంగాణ ఏర్పడిందని, ఈ కేసుకు ఎలాంటి బలం లేదని ఆయన తెలిపారు.
సుప్రీంకోర్టును ఆశ్రయించనున్న బీఆర్ఎస్
2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ టికెట్పై గెలిచిన పలువురు ఎమ్మెల్యేలు పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ప్రజల తీర్పుకు వ్యతిరేకంగా తమ పార్టీని వీడి కాంగ్రెస్లో చేరుతున్న ఎమ్మెల్యేల అనర్హత విషయంలో సుప్రీంకోర్టును ఆశ్రయించాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించినట్లు సమాచారం.
ఇప్పటికే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్లో చేరి మూడు నెలలు పూర్తికావొస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు న్యాయ నిపుణులతో బీఆర్ఎస్ పార్టీ చర్చించింది. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు ప్రకారం మూడు నెలల్లో అనర్హత పిటిషన్ పైన స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని నిబంధన ఉంది. దీంతో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులోని పేరా నెంబర్ 30, 33 ప్రకారం హైకోర్టు వెంటనే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది.
జూన్ 27వ తేదీన హైకోర్టులో దానం నాగేందర్ అనర్హత అంశంపైన విచారణ ఉంది. హైకోర్టు వెంటనే న్యాయ ప్రకారం నిర్ణయం తీసుకొని… దానం నాగేందర్ పైన అనర్హత వేటు వేయకుంటే సుప్రీంకోర్టుకు వెళ్లాలని బీఆర్ఎస్ భావిస్తోంది. దానం నాగేందర్తో పాటు ఇటీవల పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన ఒకేసారి సుప్రీంకోర్టుకు వెళ్లాలని బీఆర్ఎస్ నిర్ణయించినట్లు తెలిసింది.









