ఏపీలో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో ఇవాళ టాలీవుడ్ కు చెందిన పలువురు ప్రముఖ నిర్మాతలు భేటీ అయ్యారు. హైదరాబాద్ నుంచి నేరుగా విజయవాడ వచ్చిన వీరంతా పవన్ క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు. పవన్ తో భేటీ అయిన వారిలో సీనియర్ నిర్మాతలు అల్లు అరవింద్, అశ్వనీదత్, ఏఎం రత్నం, రాధాకృష్ణ, దిల్ రాజు, భోగవల్లి ప్రసాద్, సుప్రియ, డివివి దానయ్య, ఎన్వీ ప్రసాద్, బన్నీవాసు, నవీన్ యెర్నేని, విశ్వప్రసాద్ ఉన్నారు.
పవన్ కళ్యాణ్ తో భేటీలో వీరంతా తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించారు. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న పలు అంశాలను పవన్ దృష్టికి తెచ్చారు. అలాగే రాష్ట్రంలో సినీ రంగం అభివృద్ధికి ఉన్న అవకాశాలపైనా వీరు చర్చించారు. భారీ సినిమాలకు ప్రోత్సాహం, వినోదపు పన్ను వంటి అంశాలపైనా వీరు చర్చించారు. టాలీవుడ్ నిర్మాతలు చెప్పిన విషయాలపై పవన్ కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సినీ పరిశ్రమ సీఎం జగన్ తో అంటీ ముట్టనట్టుగా వ్యవహరించింది. దీంతో సినిమాల ప్రదర్శన రేట్లు తగ్గింపు, థియేటర్లపై దాడులు వంటి చర్యలతో బెంబేలెత్తించారు. చివరికి టాలీవుడ్ టాప్ హీరోలు ప్రభాస్, మహేష్ బాబు, చిరంజీవి వంటి వారంతా తన ముందుకు వచ్చేలా చేసుకున్నారు. అనంతరం వారికి కొన్ని వెసులుబాట్లు ఇచ్చి మమ అనిపించారు. దీంతో వైసీపీ ప్రభుత్వ తీరుపై పరిశ్రమ ఎప్పటి నుంచో గుర్రుగా ఉంది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వంపై టాలీవుడ్ వర్గాలు గంపెడాశలతో ఉన్నాయి.









