ఏపీ కొత్త ప్రభుత్వం అమరావతి పై వేగంగా అడుగులు వేస్తోంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన తరువాత అమరావతి సందర్శించారు. ఈ రోజు జరుగుతున్న మంత్రివర్గ సమావేశంలో రాజధాని భవిష్యత్ ప్రణాళికలు డిసైడ్ చేయనున్నారు. ఇదే సమయంలో అమరావతికి కొత్త రూపు తీసుకొచ్చేందుకు సీఆర్డీఏ కసరత్తు ప్రారంభించింది. ఢిల్లీ కేంద్రంగా మంత్రాంగం మొదలైంది. దీంతో..అమరావతిలో త్వరలోనే కేంద్రం కార్యచరణ ప్రారంభించనుంది.
కేంద్ర కార్యాలయాలు ఏపీ ప్రభుత్వం అమరావతి నిర్మాణం కోసం ప్రాధాన్యత ఇస్తోంది. అందులో భాగంగా అమరావతిలో కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏర్పాటు చేసేలా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. గతంలో తెలుగుదేశం హాయంలో 10 నుంచి 15 కేంద్ర సంస్థలకు, జాతీయ బ్యాంకులకు రాజధాని ప్రాంతంలో భూముల కేటాయించారు. తమకు కేటాయించిన స్థలం చూపించాలని సంస్థలు కోరినట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వ సంస్థలతో సీఆర్డీఏ అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. గతంలో కేటాయించిన భూముల విషయంలో వారి ప్రణాళికలు చెప్పాలని సీఆర్డీఏ అధికారుల నుంచి ఆయా సంస్థలకు ఫోన్లు వెళ్లినట్లు సమాచారం.
సంప్రదింపులు షురూ రాజధాని ప్రాంతంలో కేటాయించిన స్థలం చూపిస్తే తదుపరి నిర్ణయం తీసుకుంటామని కొన్ని సంస్థల ప్రతినిధుల చెప్పారని తెలిసింది. తాజా పరిణామాల నేపథ్యంలో నాబార్డ్, ఎస్బీఐ, యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఎల్ఐసీ, ఇండియన్ ఆయిల్, హెచ్పీసీఎల్, గెయిల్ వంటి సంస్థలు కూడా అమరావతిలో కార్యాలయం ఏర్పాటుచేసేందుకు ఆసక్తి తో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రోజు జరిగే మంత్రివర్గ సమావేశంలో అమరావతికి సంబంధించి అడుగులు వేయాలంటే ముందుగా న్యాయ పరంగా ఉన్న చిక్కులను తొలిగించే అంశం పైన చర్చించి ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం కనిపిస్తోంది.
నిధుల సమీకరణ అదే సమయంలో కేంద్రం నుంచి రాజధాని కోసం ఆర్దికంగా ఏపీ ప్రభుత్వం మద్దతు కోరుతోంది. కేంద్రంతో పాటుగా ఇతరత్రా ఆర్దిక సంస్థల నుంచి నిధుల సమీకరణతో అమరావతిని ముందుకు తీసుకెళ్లే విధంగా కసరత్తు జరుగుతోంది. మూడు ఫేజుల్లో అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. ఇందు కోసం లక్ష కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేసారు. తొలి ఫేజ్ నిర్మాణంలో భాగంగా మౌళిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఇందు కోసం రూ 38 వేల కోట్లు ఖర్చు అవుతుందని చెబుతున్నారు. దీంతో..నిధుల సమీకరణ..నిర్మాణాల పైన ప్రణాళికా బద్దంగా ముందుకు వెళ్లాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.









