టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ ‘కల్కి 2989 ఏడీ’. ఈ సినిమా కోసం రూ.700 కోట్లు ఖర్చు చేశారని తెలుస్తోంది. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, రాజేంద్ర ప్రసాద్, దీపికా పదుకొణె, దిశా పటానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాశీ, కాంప్లెక్స్, శంబల అనే మూడు ప్రపంచాల చుట్టూ తిరిగే కథతో ఈ సినిమా తెరకెక్కింది. ఇక ఈ సినిమా జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. తాజాగా, ఈ సినిమా టికెట్ ధరల పెంపు, అదనపు షోలకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
ఈనెల 27 నుంచి జులై 4 వరకు 8 రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించింది. అలాగే టికెట్పై గరిష్టంగా రూ.200పెంచుకునేందుకు అనుమతి వచ్చింది. కాగా, ఇటీవల టికెట్ ధరల పెంపుతోపాటు అదనపు షోలకు అనుమతి కోరుతూ వైజయంతీ మూవీస్ దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే.
సాధారణ థియేటర్లలో రూ.70, మల్టీప్లెక్స్ల్లో రూ.100 పెంచుకోవచ్చని పేర్కొంది. దీంతో పాటు ఈనెల 27న 5.30 గంటల షోకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వారం రోజుల పాటు ఐదు షోలు నిర్వహించేందుకు వీలుగా తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.