ఏపీలో కొత్త ప్రభుత్వ తొలి మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఇందు కోసం ఈ నెల 24న ముహూర్తం ఖరారైంది. రాష్ట్రంలో పాలన ప్రారంభించిన కూటమి కీలక అంశాల పైన ఈ భేటీలో నిర్ణయాలు తీసుకోనున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు..తొలి ప్రాధాన్యత అంశాలు..పాలనా పరంగా తీసుకోవాల్సిన నిర్ణయాల పైన చర్చించనున్నారు. ప్రధానంగా అమరావతి రాజధాని అంశంతో పాటుగా.. వాలంటీర్ల అంశం లో వ్యవహరించాల్సిన విధానం పైన నిర్ణయం జరగనుంది.
తొలి భేటీలో ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత తొలి సారిగా మంత్రివర్గం సమావేశం అవుతోంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవం, అమరావతి లో పర్యటించారు. ఈ రెండు కొత్త ప్రభుత్వానికి ప్రాధాన్యత అంశాలుగా ఉన్నాయి. ఇక..ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు పైన కసరత్తు ప్రారంభం అయింది. అందులో భాగంగా పెన్షన్లను రూ 4 వేలకు పెంచుతూ సీఎం చంద్రబాబు ఇప్పటికే సంతకాలు చేసారు. అయితే, పెన్షన్ల పంపిణీ లో వాలంటీర్లను కొనసాగించాలా..ప్రత్యామ్నాయ మార్గాల్లో ముందుకు వెళ్లాలా అనేది నిర్ణయం తీసుకోనున్నారు.
కీలక అంశాలపై చర్చ ఎన్నికల సమయంలో రాజీనామా చేసిన వాలంటీర్లు సైతం తిరిగి తమకు అవకాశం ఇప్పించాలని కోరుతున్నారు. కొత్త వాలంటీర్ల భర్తీ విధానంలో అనుసరించాల్సిన విధానం పైన చర్చించనున్నారు. అదే విధంగా గతంలో పని చేసిన వారిని కొనసాగించాలా వద్దా అనే అంశం పై తుది నిర్ణయం జరిగే అవకాశం ఉంది. దీంతో పాటుగా అమరావతి విషయంలో ఏ విధంగా ముందుకు వెళ్లాలనే దాని పైన మంత్రివర్గంలో చర్చించనున్నారు. ముందుగా సుప్రీంకోర్టులో గత ప్రభుత్వం అమరావతికి అనుకూలంగా హైకోర్టు ఇచ్చిన తీర్పు పైన అప్పీల్ కు వెళ్లింది. ఆ కేసు విచారణలో ఉంది. దీని పైన న్యాయపరంగా ఏం చేయాలో ఈ సమావేశంలో నిర్ణయించనున్నారు.
భవిష్యత్ కార్యాచరణ రాష్ట్రంలోని ఆర్దిక పరిస్థితి గురించి కేబినెట్ భేటీలో మంత్రులకు ప్రత్యేకంగా వివరించనున్నారు. రాష్ట్రంలోని ఆర్దిక స్థితి గతులు, అమరావతి, పోలవరం పైన శ్వేత పత్రాల విడుదలకు ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశంలో ప్రభుత్వం కాల పరిమితితో తమ ప్రాధాన్యతా అంశాలను ఖరారు చేయనుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్లే అంశం పైన చర్చించే ఛాన్స్ కనిపిస్తోంది. దీంతో.. కూటమి ప్రభుత్వం తీసుకొనే నిర్ణయాల పైన ఉత్కంఠ కొనసాగుతోంది.









