ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు రిలీఫ్ దొరికే పరిస్థితి లేదు. ఆమె ఈడీ, సీబీఐ ఉచ్చు నుండి బయటపడే పరిస్థితి కనిపించడం లేదు. తాజాగా మరోమారు కవితకు ఊహించని షాక్ తగిలింది. కవిత కస్టడీని పొడిగిస్తూ రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు తీర్పు ఇచ్చింది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసిన నాటి నుండి ఇప్పటివరకు కవితకు అన్నీ చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి.
కవిత బయటకు రావటానికి చేసిన ప్రయత్నాలు విఫలం ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కవితను అరెస్ట్ అయిన నాటి నుండి ఆమె బెయిల్ కోసం చేస్తున్న ప్రయత్నాలు అన్నీ బూడిదలో పోసిన పన్నీరుగా మారాయి. మార్చి 26న కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేసి ఆమెను కోర్టు ముందు హాజరు పరిచి ఆమెను తీహార్ జైలుకు పంపిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కవితను ఈడీ అధికారులు విచారించారు.
కవిత బయటకు రావటం కష్టమే అప్పటినుంచి ఇప్పటివరకు ఈ కేసు నుంచి బయటపడటం కోసం కవిత శతవిధాలా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కానీ కవితకు అడుగడుగునా కోర్టులో చుక్కెదురవుతూనే ఉంది. కవిత మధ్యంతర బెయిల్ కోసం, సాధారణ బెయిల్ వచ్చే పరిస్థితి లేకపోగా, కస్టడీ ముగిసినా కవిత కస్టడీని కోర్టు పొడిగిస్తూ పోతుంది.ఒకవైపు ఈడీ, మరొకవైపు సిబిఐ మూకుమ్మడిగా దాడి చేయడంతో కవిత ఈ కేసు నుండి బయటపడే మార్గం కనిపించటం లేదు.
మళ్ళీ కస్టడీ పొడిగించిన కోర్టు ఇప్పటికే అనేకమార్లు కవిత కస్టడీని పొడిగించిన రౌస్ అవెన్యూ కోర్టు తాజాగా మరో మారు జూన్ 3వ తేదీ వరకు కవిత జ్యూడిషియల్ కస్టడీని పొడిగించింది. ఈడీ, సీబీఐ కేసులలో రిమాండ్ ముగియడంతో కవితను నేడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తీహార్ జైలు నుంచి హాజరుపరిచారు.
కవిత కస్టడీ 14 రోజులు పొడిగింపు ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత పాత్రపై దర్యాప్తు కొనసాగుతున్నందున ఆమె కస్టడీని పొడిగించాలని కోర్టుకు విజ్ఞప్తి చేయటంతో కోర్టు కవిత కస్టడీని జూన్ 3 తేదీ వరకు పొడిగించింది. మళ్ళీ కోర్టు 14 రోజుల రిమాండ్ ను పొడిగించింది. మొత్తానికి ఎమ్మెల్సీ కవితకు మళ్లీ కోర్టులో షాకిచ్చి బయటకు రావటం కష్టమే అని తేల్చారు.









