తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం పాలనా పరంగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఎన్నికల సమయంలో అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు ఇస్తామని నాడు కాంగ్రెస్ నేతలు హామీ ఇచ్చారు. ఇందిరమ్మ ఇళ్ల పైనా భరోసా కల్పించారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పుడు వీటి పైన ప్రభుత్వం ఫోకస్ చేసింది. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న రేషన్ కార్డుల సమస్య పరిష్కాకం కోసం మంత్రి పొంగులేటి కీలక ప్రకటన చేసారు.
కొత్త కార్డుల జారీ తెలంగాణలో రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల కోసం లబ్దిదారుల నుంచి ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించింది. వాటిని స్క్రూటినీ చేసింది. ఎంత మందికి రేషన్ కార్డులు ఇవ్వాల్సి ఉంటుందనే అంచనాకు వచ్చింది. రేషన్ కార్డు ప్రాతిపదికన సంక్షేమ పథకాలు అమలు చేస్తుండటంతో..ప్రతీ నిర్ణయంలోనూ ఆచితూచి వ్యవహరిస్తోంది. కేసీఆర్ ప్రభుత్వంలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వకపోవటంతో చాలా మంది ఇప్పుడు కొత్తగా దరఖాస్తు చేసారు. గత ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వకపోవటం పైన లబ్దిదారుల్లో ఆగ్రహం వ్యక్తమైంది. దీనిని గుర్తించిన కాంగ్రెస్ నేతలు కొత్త కార్డుల జారీకి నిర్ణయించారు.
కోడ్ పూర్తయిన వెంటనే తాజాగా మంత్రి పొంగులేటి ఈ అంశం పైన స్పష్టత ఇచ్చారు. త్వరలోనే కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభం అవుతుందని ప్రకటించారు. ఎన్నికల కోడ్ పూర్తయిన వెంటనే దీని పైన స్పష్టమైన నిర్ణయం ఉంటుందని వెల్లడించారు. ప్రభుత్వం ప్రకటించిన విధంగానే ఆరు గ్యారంటీలు అమలు చేసి తీరుతామని, కొత్త రేషన్ కార్డుల జారీకి శ్రీకారం చుట్టనున్నట్లు చెప్పారు. ఇందిరమ్మ ఇళ్లపై కూడా కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. రాష్ట్రంలో ఇళ్లు లేని ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు.
మంత్రివర్గం కసరత్తు ఇందిరమ్మ ఇళ్లతో పాటు త్వరలోనే అర్హులు అందరికీ కొత్త పెన్షన్లు, పెంచిన పెన్షన్లు, కొత్త రేషన్ కార్డులు ఇస్తామని ఆయన తెలిపారు. దీంతో వీటన్నింటిపై రాష్ట్ర ప్రజలు ఎంతగానో ఆశలు పెట్టుకున్నారు. అలాగే పాలేరు నియోజకవర్గం తన సొంత ఇల్లు అని, ఎన్నికల కోడ్ ముగియగానే నియోజకవర్గంలో అభివృద్ధి పనులు మొదలు పెడాతానని మంత్రి పొంగులేటి చెప్పుకొచ్చారు. ఇక..ఆగస్టు 15 లోగా రైతు రుణ మాఫీ అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ పదే పదే చెప్పారు. ఈ రోజు జరుగుతున్న మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని భావించినా.. ఎన్నికల సంఘం ఆంక్షలతో వాయిదా పడింది. కోడ్ ముగిసిన తరువాత నిర్ణయం తీసుకోనున్నారు.









