UPDATES  

NEWS

 మంత్రివర్గ సమావేశం వాయిదా…!

ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వకపోవడంతో తెలంగాణ మంత్రివర్గ భేటీ వాయిదా పడింది. శనివారం సచివాలయంలో మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఎన్నికల సంఘం అనుమతి కోరింది ప్రభుత్వం. అయితే ఎన్నికల సంఘం అనుమతి కోసం శనివారం సాయంత్రం వరకు ఎదురు చూశారు. ఎన్నికల సంఘం ఎలాంటి స్పందన రాకపోవడంతో కేబినేట్ సమావేశాన్ని వాయిదా వేయాల్సి వచ్చింది.

 

మంత్రివర్గ సమావేశం ఉందని చాలా మంది మంత్రులు సచివాలయానికి వచ్చారు. సాయంత్రం వరకు వేచి ఉన్నారు. అయితే ఈసీ మధ్యాహ్నం వరకు అనుమతి రాకపోవడంతో సీఎం రేవంత్ రెడ్డి సాగునీటి పారుదల శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశానికి సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, దేవదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖతోపాటు నీటిపారుదల ఉన్నతాధికారులు హాజరయ్యారు.

సమీక్ష అనంతరం కూడా ఈసీ అనుమతి కోసం చూశారు. అయినా ఎలాంటి స్పందన రాకపోవడంతో సీఎం, మంత్రులు వెళ్లిపోయారు.ఈసీ నుంచి అనుమతి రాకపోవడంతో కొన్ని కీలక అంశాలను చర్చించలేకపోయామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేబినేట్ భేటీపై సోమవారం లోగా ఈసీ అనుమతి కోసం వేచి చూస్తామని చెప్పారు. ఈ మంత్రివర్గ సమావేశంలో రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు, ఖరీఫ్ పంటల ప్రణాళిక, రైతులకు సంబంధించిన పలు కీలకమైన విషయాలను ఎజెండాలో చేర్చారు.

 

అలాగే జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావ దినోత్సవ వేడుకలు. రాష్ట్ర పునర్విభజనకు పదేళ్లు పూర్తి కావటంతో ఇప్పటివరకు రెండు రాష్ట్రాల మధ్య పెండింగ్లో ఉన్న అంశాలు, పునర్విభజన చట్టంలో పెండింగ్లో ఉన్న కీలకమైన అంశాలను కేబినేట్ భేటీలో చర్చించాలనుకున్నారు. మంత్రివర్గ సమావేశానికి ఈసీ అనుమతి ఇవ్వకపోవడంతో వాయిదా పడింది.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |