పిఠాపురం.. మొన్నటి వరకు ఏపీలో ఎక్కడ చూసిన ఈ నియోజకవర్గం గురించే చర్చ సాగుతోంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. దీంతో పిఠాపురం నియోజకవర్గం ఏపీ రాజకీయాల్లో ఒక్కసారిగా హాట్ టాపిక్గా మారింది. గత ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కల్యాణ్ ..వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి చట్టసభల్లో అడుగు పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. కూటమి తన గెలుపుకు కలిసి వస్తుందని పవన్ కల్యాణ్ లెక్కలు వేసుకుంటున్నారు. పిఠాపురంలో టీడీపీ నేతలతో కలిసి పవన్ కల్యాణ్ విసృతంగా ప్రచారం నిర్వహించారు.
ఇప్పటికే జబర్దస్త్ నటులు, మెగాస్టార్ చిరంజీవి, నేచురల్ స్టార్ నాని, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన మద్దతు తెలుపుతూ వీడియోలు, పోస్ట్లు రిలీజ్ చేశారు. తేజా సజ్జా, రాజ్ తరుణ్ వంటి యంగ్ హీరోలు సైతం పవన్ కల్యాణ్కు తమ మద్దతు తెలిపారు. నిర్మాత నాగవంశీ కూడా పవన్కు సపోర్ట్ చేశారు. అల్లు అర్జున్, హీరోయిన్ శ్రీలీల వంటి స్టార్స్ కూడా పవన్ కల్యాణ్కు మద్దతుగా ట్వీట్స్ చేశారు. ఈసారి పవన్ కల్యాణ్ గెలుపు ఖాయమని కూటమి నేతలు చెబుతున్నారు.
ఇదిలా ఉంటే పిఠాపురంలో సరికొత్త రాజకీయానికి తెరలేపినట్టు కనిపిస్తోంది. పిఠాపురంలో పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేగా విజయం సాధిస్తే..అక్కడ నెంబర్ 2 స్థానం కోసం ఇరువురు నేతల మధ్య పోరు సాగుతున్నట్టు తెలుస్తోంది. పవన్ కల్యాణ్ కోసం పిఠాపురం టికెట్ను త్యాగం చేశారు వర్మ. ఒకవేళ పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేగా విజయం సాధిస్తే..స్థానిక నేత కాబట్టి ఆయనకే నియోజకవర్గ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని టీడీపీ నేతలు చెబుతున్నారు. మరోవైపు నాగబాబుకు సైతం నియోజకవర్గ సమస్యలను పరిష్కరించే బాధ్యతలను ఇస్తారని జనసేన కార్యకర్తలు నమ్ముతున్నారు. దీంతో పిఠాపురంలో నాగబాబు వర్సెస్ వర్మ అన్నట్టుగా సాగుతోంది. మరీ వీరిలో ఎవరికి నియోజకవర్గ బాధ్యతలు దక్కతాయో చూడాలి.









