పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ప్రస్తుతం సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. అందుకు కారణం చాలా గ్యాప్ తరువాత హరిహర వీరమల్లు నుంచి అప్డేట్ రావడమే. పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం హరిహర వీరమల్లు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై AM రత్నం నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో పవన్ సరసన నిధి అగర్వాల్ నటిస్తుండగా.. బాహుబలి బ్యూటీ నోరా ఫతేహి కీలక పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, వీడియో గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
తాజాగా ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ గా హరిహర వీరమల్లును తీర్చిదిద్దారు. 17వ శతాబ్దంలో పేదల పక్షాన పోరాడిన ఒక యోధుడి కథగా రూపొందుతోన్న ఈ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం కోసం, నిర్మాతలు ప్రత్యేకంగా చార్మినార్, ఎర్రకోట మరియు మచిలీపట్నం ఓడరేవు వంటి భారీ సెట్లను అంతర్జాతీయ స్థాయి నిర్మాణ విలువలతో ఎక్కడా రాజీ పడకుండా నిర్మించినట్లు కనిపిస్తోంది. పేదలు దోపిడీకి గురవుతూ, ధనవంతులు మరింత అభివృద్ధి చెందుతున్న ప్రాంతంలో.. న్యాయం కోసం యుద్ధం చేసే ఒంటరి యోధుడుగా పవన్ కళ్యాణ్ కనిపించాడు. హరిహర వీర మల్లు పాత్ర తీరుని తెలుపుతూ బలమైన సంభాషణలు, ఆ సంభాషణలకు తగ్గట్టుగా అద్భుతమైన దృశ్యాలతో టీజర్ ను రూపొందించిన తీరు కట్టిపడేసింది.
అద్భుతమైన విజువల్స్, భారీ సెట్లతో ఎం.ఎం. కీరవాణి అద్భుతమైన నేపథ్య సంగీతంతో థియేటర్లలో ఒక గొప్ప అనుభూతిని అందించింది. పేద, అణగారిన వర్గాలకు అండగా నిలబడే వీరుడిలా పవన్ కళ్యాణ్ కనిపిస్తుంటే, మొఘల్ చక్రవర్తిగా ప్రముఖ హిందీ నటుడు బాబీ డియోల్ కనిపిస్తున్నారు. ఆహార్యం పరంగా, అభినయం పరంగా ఇద్దరూ ఆయా పాత్రలకు వన్నె తెచ్చారని టీజర్ తోనే అర్థమవుతోంది. టీజర్ లో రోమాలు నిక్కబొడుచుకునేలా చేసే అంశాలు ఎన్నో ఉన్నాయి. చట్టవిరుద్ధంగా నైనా, న్యాయం కోసం పేదల పక్షాన చేస్తున్న ఆ యోధుడి పోరాటం స్ఫూర్తిని కలిగిస్తోంది.
ప్రస్తుతం ఈ టీజర్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ సినిమా రెండు పార్ట్స్ గా రిలీజ్ అవుతుందని మేకర్స్ తెలిపారు. మొదటి భాగం హరిహర వీర మల్లు పార్ట్-1: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్ పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ధర్మం కోసం యుద్ధం అనేది ఉపశీర్షిక.త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో పవన్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.