ఏపీలో ఎన్నికల పోరు ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. కూటమి – వైసీపీ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా ఎన్నికల సమరం కొనసాగుతోంది. మేనిఫెస్టోలు వెల్లడయ్యాయి. ప్రచారం పతాక స్థాయికి చేరింది. మరో పది రోజుల్లో పోలింగ్ జరగనుంది. ఈ సమయంలోనూ జనసేన గుర్తు గాజు గ్లాసు పై కొత్త చర్చ మొదలైంది. తాజాగా ఎన్నికల సంఘం నిర్ణయంతో కూటమి నేతలు ఆందోళన చెందుతున్నారు. మరోసారి కోర్టును ఆశ్రయించారు. నిర్ణయం మారకుంటే మొత్తానికే నష్టం జరుగుతుందనే ఆందోళన వ్యక్తం అవుతోంది.
గాజు గ్లాసు గుర్తు టెన్షన్ ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ కూటమిలో కొత్త టెన్షన్ మొదలైంది. జనసేన గాజు గ్లాసు గుర్తు ఎపిసోడ్ ఈ టెన్షన్ కు కారణమవుతోంది. గాజు గ్లాసు ఫ్రీ సింబల్ గా పేర్కొనటంతో పలువురు స్వతంత్ర అభ్యర్దులకు ఎన్నికల సంఘం జనసేన పోటీలో లేని నియోజకవర్గాల్లో కేటాయించింది. దీని పైన ఎన్డీఏ పార్టీలు ఎన్నికల సంఘం, కోర్టును ఆశ్రయించాయి. ఆ తరువాత ఎన్నికల సంఘం తమ నిర్ణయంలో సవరణలు చేసింది. జనసేన పోటీ చేసే రెండు ఎంపీ స్థానాలతో పాటుగా, మొత్తం 13 పార్లమెంట్ సెగ్మెంట్ల పరిధిలో జనసేన పోటీ చేస్తోంది.
హైకోర్టులో తాజా పిటీషన్ ఎన్నికల సంఘం తాజా నిర్ణయంతో విజయనగరం, అరకు, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, అమలాపురం, రాజమండ్రి, నరసాపురం, ఏలూరు, బందరు, గుంటూరు, తిరుపతి, రాజంపేట లోక్ సభ స్థానాల్లో కూటమికి గాజు గ్లాస్ గండం తప్పింది. 13 పార్లమెంట్ స్థానాల్లో గాజు గ్లాస్ గుర్తుని జనసేనకే ఫ్రీజ్ చేసిన ఈసీ మిగిలిన నియోజకవర్గాల్లో మాత్రం ఫ్రీ సింబల్ గానే కొనసాగించింది. ఎన్నికల సంఘం నిర్ణయంతో ఆయా పార్లమెంట్ స్థానాల్లో గాజు గ్లాస్ సింబల్ దక్కించుకునే అవకాశాన్ని స్వతంత్రులు కోల్పోయారు. బందరు, కాకినాడ పార్లమెంట్ పరిధిలోని 14 అసెంబ్లీ సెగ్మెంట్లల్లోనూ జనసేనకే గాజు గ్లాస్ సింబల్ రిజర్వ్ చేసారు. ఈ మేరకు సింబల్ కేటాయింపుల్లో మార్పులు చేయాలని ఆర్వోలకు సీఈఓ మీనా ఆదేశించారు. అయితే, ఎన్నికల సంఘం నిర్ణయంతో ఎన్డీఏ కూటమి నేతలు అప్రమత్తం అయ్యారు.
ఊరట దక్కేనా తాగాజా టీడీపీ ఏపీ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. జన సేనకు కేటాయించిన గాజు గ్లాసు గుర్తును ఏపీలో 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాల్లో వేరే ఎవరికి కేటాయించ వద్దనీ అత్యవసర పిటిషన్ లో న్యాయస్థానాన్ని టీడీపీ నేతలు కోరారు. టీడీపీ, బీజేపీ, జన సేన కలిసి పోటీ చేస్తున్న కారణంగా గాజు గ్లాసు గుర్తును జన సేనకే రిజర్వ్ చేస్తూ ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ లో అభ్యర్దించారు. టీడీపీ నేత వర్ల రామయ్య దాఖలు చేసిన ఈ పిటీషన్ ను ఈ రోజు హైకోర్టు విచారణ చేయనుంది. తమకు అనుకూలంగా నిర్ణయం రాకపోతే కూటమి ఓట్ల బదిలీలో నష్టం జరిగే అవకావం ఉందని నేతలు ఆందోళన చెందుతున్నారు. దీంతో, కోర్టు – ఎన్నికల సంఘం నిర్ణం పైన ఉత్కంఠ కొనసాగుతోంది.