UPDATES  

NEWS

 జగన్ కేసులపై సుప్రీంకు సీబీఐ అప్ డేట్..! విచారణ ఆలస్యం వెనుక..? కీలక సూచన…

ఏపీలో సీఎం జగన్ పై 2011లో నమోదైన అక్రమాస్తుల కేసుల దర్యాప్తు రెండేళ్లలో పూర్తి చేసిన సీబీఐ 2013లోనే హైదరాబాద్ సీబీఐ కోర్టులో ఛార్జిషీట్లు దాఖలు చేసింది. అయితే అప్పటి నుంచి ఇప్పటివరకూ ఈ ఛార్జిషీట్లపై విచారణలో పురోగతి లేకుండా పోయింది. దీనిపై గతంలో వైసీపీ ఎంపీగా ఉన్న రఘురామకృష్ణంరాజు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు సీబీఐకి చీవాట్లు పెట్టింది. దీంతో తాజా పరిస్ధితిపై సుప్రీంకోర్టుకు సీబీఐ అప్ డేట్ ఇచ్చింది.

 

వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసుల్లో తాము సీబీఐ కోర్టులో దాఖలు చేసిన ఛార్జిషీట్లపై విచారణ ఎందుకు ఆలస్యమవుతోందన్న దానిపై సీబీఐ సుప్రీంకోర్టుకు కీలక అప్ డేట్ ఇచ్చింది. ఇందులో 2013లో తాము చివరి ఛార్జిషీట్ దాఖలు చేసిన తర్వాత నుంచి చోటు చేసుకున్న పరిణామాలను వివరించింది. ఈ కేసులో సీబీఐ కోర్టులో జరుగుతున్న ఛార్జిషీట్ల విచారణను అడ్డుకునే లక్ష్యంతో నిందితులు ఏకంగా 39 క్వాష్ పిటిషన్లు, 95 డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు చేశారని సుప్రీంకోర్టుకు తెలిపింది.

 

అలాగే ఈ క్వాష్ పిటిషన్లు, డిశ్చార్జ్ పిటిషన్లను విచారించి సీబీఐ కోర్టు తీర్పులివ్వకముందే జడ్జీలు బదిలీ అయిపోతున్నారని సీబీఐ సుప్రీంకోర్టుకు తెలిపింది. ఇలా ఆరుగురు జడ్డీలు బదిలీ అయ్యారని వెల్లడించింది. ఈ పిటిషన్లను విచారించిన చివరి న్యాయమూర్తి సైతం కనీసం రెండేళ్లు కూడా కాకుండానే బదిలీ అయ్యారని తెలిపింది. నిందితులు శక్తిమంతులని, ఏదో ఒక కారణం చూపుతూ పిటిషన్లు దాఖలు చేసి విచారణ ముందుకు సాగకుండా చేస్తున్నారని ఆరోపించింది.

 

మరోవైపు ఈ కారణంతో విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేస్తే సాక్ష్యులకు ఇబ్బందులు తప్పవని సుప్రీంకోర్టుకు సీబీఐ తెలిపింది. జగన్ అక్రమాస్తుల కేసుల్లో మొత్తం 911 మంది సాక్ష్యులున్నారని, వారంతా 50 ఏళ్ల పైబడిన వాళ్లేనని తెలిపింది. కాబట్టి పిటిషనర్ రఘురామ కోరినట్లుగా ఈ విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయొద్దని విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం సీబీఐ కోర్టులో ఉన్న న్యాయమూర్తులు సరిపోవడం లేదని, అదనపు న్యాయమూర్తులను కేటాయించడంతో పాటు రోజువారీ విచారణ జరిగేలా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టును సీబీఐ కోరింది.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |