ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టై.. ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పై నేడు తీర్పు వెలువడింది. సీబీఐ, ఈడీ పెట్టిన కేసుల్లో కీలక నిందితురాలిగా ఉన్న కవిత బెయిల్ పై రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా నేడు తీర్పు ఇచ్చారు. ఈసారి కూడా కవితకు షాక్ తప్పలేదు. సీబీఐ కోర్టు కవితకు బెయిల్ రిజెక్ట్ చేసింది.
లిక్కర్ స్కామ్ పై ఈడీ, సీబీఐ పెట్టిన రెండు కేసుల్లోనూ కోర్టులో ఇరు పక్షాల వాదనలు ముగిశాయి. మార్చి 15న ఈడీ అధికారులు కవిత ఇంట్లో సోదాల అనంతరం అరెస్ట్ చేసి ఢిల్లీ కోర్టులో హాజరు పరిచి కస్టడీకి తీసుకున్నారు. మరోసారి కస్టడీ పొడిగించాక.. ఆ గడువు కూడా పూర్తవ్వగా తీహార్ జైలుకు పంపారు. జైలులో ఉన్న కవితను సీబీఐ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం కవిత జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైల్లోనే ఉంది. రేపటితో కవిత జ్యుడీషియల్ కస్టడీ ముగియనుండగా.. నేడు బెయిల్ పై తీర్పు వెలువడింది. కవితకు అనుకూలంగా బెయిల్ మంజూరవుతుందని ఎదురుచూసిన వారందరికీ నిరాశ తప్పలేదు.
కోర్టుకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కాకుండా నేరుగా విచారణ హజరయ్యేలా అనుమతివ్వాలని కవిత తరపు న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ పై కూడా జడ్జి కావేరి బవేజా మధ్యాహ్నం 2 గంటలకు నిర్ణయాన్ని ప్రకటించనున్నారు.
ఏప్రిల్ 22న బెయిల్ పిటిషన్లపై విచారణ చేసిన కోర్టు.. ఇరుపక్షాల వాదనల అనంతరం మర్నాటికి తీర్పును వాయిదా వేసింది. ఏప్రిల్ 24న బెయిల్ పిటిషన్లను పరిశీలించిన న్యాయమూర్తి.. తీర్పును మే 2కు వాయిదా వేశారు. కానీ.. ఆ రోజు కూడా తీర్పును వెలువరించలేదు. తుదితీర్పును మే6కు వాయిదా వేశారు. బెయిల్ రిజెక్ట్ అవ్వడంతో.. కవిత మళ్లీ తీహార్ జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి.