ఏపీ ఎన్నికల్లో కొత్త గేమ్ మొదలైంది. జగన్ మేనిఫెస్టో ప్రకటించారు. రెండు మూడు పథకాల పరిమితి పెంచుతూ, కొత్త హామీలను తగ్గించి..నవరత్నాల కొనసాగింపుకు ప్రాధాన్యత ఇచ్చారు. తమ సూపర్ సిక్స్ హామీ ల ముందు జగన్ మేనిఫెస్టో తేలిపోయిందని చంద్రబాబు ప్రచారం చేస్తున్నారు. అయితే, అక్కడే జగన్ అసలు లెక్క దాగి ఉంది. అభివృద్ధికి తాను బ్రాండ్ అంబాసిడర్ గా చెప్పుకొనే చంద్రబాబు..ఇప్పుడు పథకాల విషయంలో జగన్ కంటే ఎక్కువ ఇస్తానని చెప్పటం ఎన్నికల ఫలితంలో కీలకంగా మారుతోంది.
జగన్ లెక్కల వెనుక ముఖ్యమంత్రి జగన్ మేనిఫెస్టో లెక్కల వెనుక పక్కా వ్యూహంతో వ్యవహరించారు. వాస్తవాలు, చేసేదే చెబుతామంటూ విశ్వసనీయను పదే పదే ప్రస్తావిస్తూ ఆర్భాటం లేకుండా మేనిఫెస్టో ప్రకటించారు. బలమైన కూటమి, పెరిగిన ప్రత్యర్దులతో జగన్ భారీ పథకాలు, హామీలు ప్రకటిస్తారని పార్టీ కేడర్ కూడా ఆశించింది. కానీ, జగన్ తన లెక్క ప్రకారమే ముందుకు వెళ్లారు. 2019 నుంచి అమలు చేస్తున్న నవరత్నాలకే కొనసాగించేలా హామీ ఇచ్చారు. అమ్మఒడి, రైతు భరోసా, పెన్షన్ మాత్రమే పెంచారు. తన సంక్షేమ పథకాల ఖర్చు, చంద్రబాబు సూపర్ సిక్స్ హమీల ఖర్చు విశ్లేషించారు. అక్కడే జగన్ పక్కా రాజకీయ వ్యూహం తో చంద్రబాబు పై మేనిఫెస్టో తో గురి పెట్టారు. జగన్ ట్రాప్ లో చంద్రబాబు చిక్కుకున్నట్లు కనిపిస్తోంది.
చంద్రబాబు వ్యూహం ఏంటి జగన్ సంక్షేమం అందని వారు, పథకాలను వ్యతిరేకిస్తున్న వారు చంద్రబాబుకు మద్దతుగా నిలుస్తున్నారు. పథకాలు కోరుకుంటున్న వారు జగన్ తోనే ఉన్నారు. అయితే, ఇప్పుడు చంద్రబాబు తాను జగన్ కంటే మెరుగైన సంక్షేమం అందిస్తానని..సంపద పెంచి సంక్షేమం అందిస్తానని చెబుతున్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నంత కాలం సంపద పెరగలేని ఆర్బీఐ లెక్కలతో జగన్ వివరించారు. ఇక, ఇప్పుడు ఈ నెల 30న టీడీపీ కూటమి తమ మేనిఫెస్టో ప్రకటించనుంది. ప్రచార సభల్లో చంద్రబాబు, పవన్ ఇప్పటికే కొనసాగుతున్న సంక్షేమ పథకాలను కొనసాగిస్తామని హామీ ఇస్తున్నారు. టీడీపీ ప్రకటించిన సూపర్ సిక్స్ లో జగన్ అమలు చేస్తున్న అమ్మఒడి, పెన్షన్లు కాకుండా మూడు ఉచిత సిలిండర్లు, మహిళలకు నెలకు రూ 2,500, రైతులకు ఏడాదికి రూ 20 వేలు, బీసీ సంక్షేమం ఉన్నాయి.
జగన్ ట్రాప్ లో చిక్కారా ఇప్పుడు మేనిఫెస్టోలో జగన్ పథకాలను కొనసాగిస్తామని ప్రకటిస్తే మొత్తం ఖర్చు భారీగా పెరుగుతోంది. ప్రకటించకపోతే జగన్ ఓట్ బ్యాంక్ టీడీపీ వైపు చూసే అవకాశం ఉండదనే వాదన ఉంది. పథకాలతో పాటుగా అభివృద్ధి గురించి వివరిస్తూ ఇప్పటికే జగన్ ప్రచారం చేస్తున్న విశ్వసనీయత అసలు అంశంగా మారనుంది. జగన్ అమలు చేసిన పథకాలతో రాష్ట్రం నష్టపోయిందని చంద్రబాబు ప్రచారం చేసారు. జగన్ అమలు చేసిన పథకాలనే చంద్రబాబు అమలు చేస్తే..జగన్ నిర్ణయాలకు మద్దతు ఇచ్చినట్లే అవుతుంది. వాటిని కొనసాగిస్తే అభివృద్ధి పేరుతో చంద్రబాబుకు మద్దతుగా నిలుస్తున్న వారిలోనే అభిప్రాయం మారే ఛాన్స్ ఉంటుందనే వాదన ఉంది. ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న జగన్ వ్యూహాత్మకంగా పథకాలను పెంచకుండా మేనిఫెస్టో ప్రకటించారు. దీంతో..చంద్రబాబు ప్రకటించే మేనిఫెస్టో ఇప్పుడు ఎన్నికల్లో గెలుపు – ఓటముల పైన ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది.









