బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్.. కరీంనగర్ లోక్సభ నియోజకవర్గంలో పార్టీ బూత్ కమిటీ స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ- తెలంగాణ ఉమ్మడి రాజధానిగా ఉంటూ వస్తోన్న హైదరాబాద్ భవిష్యుత్తు గురించి ప్రస్తావించారు.
హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉందని బాంబు పేల్చారు. దీనికి కాంగ్రెస్ కూడా వత్తాసు పలుకుతోందని అన్నారు. తెలంగాణ ఆవిర్భవించిన జూన్ 2వ తేదీ నాటితో ఉమ్మడి రాజధాని హోదా ముగిసిపోతుందని, ఆ వెెంటనే హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటిస్తారని చెప్పారు.
దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తన వద్ద ఉందని కేటీఆర్ స్పష్టం చేశారు. 10 సంవత్సరాల వరకే హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని పునర్విభజన చట్టంలో పొందుపరిచిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ తరువాత అవసరమైతే హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటిస్తారనే పక్కా సమాచారం ఉందని అన్నారు.
ఢిల్లీలో ప్రస్తుతం బీజేపీ, గల్లీలో కాంగ్రెస్ అధికారంలో ఉందని, బీఆర్ఎస్కు ఎందుకు ఓటు వేయాలంటూ కొందరు తనను ప్రశ్నిస్తోన్నారని కేటీఆర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్కు ఓటు ఎందుకు వేయాలనడానికి నాలుగు కారణాలు ఉన్నాయంటూ కేటీఆర్ చెప్పారు. హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతంగా బదలాయించడాన్ని అడ్డుకోవడానికి లోక్సభలో గులాబీ జెండా ఎగరాల్సిన అవసరం ఉందని అన్నారు.
నదుల అనుసంధానం ద్వారా గోదావరి నదీ జలాలను కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు తరలించుకు వెళ్తానంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెబుతున్నారని, తెలంగాణ అవసరాలు తీరకుండా ఇక్కడి నీళ్లను తీసుకెళ్లడాన్ని అడ్డుకునే సత్తా గులాబీ జెండాకు మాత్రమే ఉందని కేటీఆర్ పేర్కొన్నారు.
తమకు పార్లమెంట్లో మూడొంతుల మోజారిటీ లభిస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లను ఎత్తేస్తామంటూ బీజేపీ బాహటంగానే చెబుతోందని కేటీఆర్ విమర్శించారు. ఈ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్కు ఓటు వేస్తే జరగబోయే పరిణామాలన్నీ ఇవేనని ఆయన చెప్పారు. వాటని గల్ల పట్టి నిలదీయడానికి పార్లమెంట్లో బీఆర్ఎస్ సభ్యుల అవసరం ఉందని అన్నారు.









