UPDATES  

NEWS

 నా భర్తను జైల్లోనే చంపాలనుకుంటున్నారు.. బీజేపీపై కేజ్రీవాల్ భార్య సునీత సంచలనం..

తన భర్త అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal)ను తీహార్ జైల్లోనే చంపాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కోరుకుంటోందని సునీత కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. ఆయనకు ఇచ్చే ప్రతి ఆహారాన్ని జైలు అధికారులు పర్యవేక్షిస్తున్నారని అన్నారు. ‘ఇండియా’ కూటమి ఆధ్వర్యంలో రాంచీలో నిర్వహించిన బహిరంగ సభలో కేంద్రంపై తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

 

కేంద్ర ప్రభుత్వ నియంతృత్వానికి వ్యతిరేకంగా విపక్షాల కూటమి పోరాడుతోందన్నారు. తన భర్త అరవింద్ కేజ్రీవాల్ ను చంపాలని అనుకుంటున్నారని సునీత ఆరోపించారు. ఆయనకిచ్చే ఆహారాన్ని పర్యవేక్షించేందుకు కెమెరాలు ఏర్పాటు చేశారన్నారు. మధుమేహంతో బాధపడుతున్న కేజ్రీవాల్.. 12 ఏళ్లుగా ఇన్సులిన్ తీసుకుంటున్నారని.. కానీ, ఆయనకు జైల్లో మాత్రం ఇన్సులిన్ ఇవ్వడం లేదని ఆరోపించారు. ఆయనకు 50 యూనిట్ల ఇన్సులిన్ అవసరమని చెప్పారు.

 

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ లను ఈడీ అరెస్టు చేయడంపై సునీత మండిపడ్డారు. నేరం రుజువు కాకుండానే వాళ్లను జైల్లో పెట్టారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వానిది నియంతృత్వమేనని అన్నారు. మంచి విద్య, ఆరోగ్య వసతులు కల్పించడమే తన భర్త కేజ్రీవాల్ చేసిన తప్పిదమా? అని ప్రశ్నించారు. ప్రజల కోసం కేజ్రీవాల్ తన ప్రాణాలను పణంగా పెట్టారన్నారు.

 

ఐఆర్ఎస్ అధికారి అయిన కేజ్రీవాల్.. ప్రజా సేవ కోసం ముందుకు వచ్చారని సునీత తెలిపారు. కాగా, ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టయిన కేజ్రీవాల్ ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న విషయం తెలిసిందే. ఇది ఇలావుండగా, ఇండియా కూటమి రాంచీలో నిర్వహించిన బహిరంగ సభలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. జైల్లో ఉన్న అరవింద్ కేజ్రీవాల్, హేమంత్ సోరెన్ ల కోసం సభా వేదికపై ప్రత్యేకంగా ఖాళీ కుర్చీలు ఉంచారు. సభా వేదిక ఆవరణలో ఈ ఇద్దరు నేతల భారీ కటౌట్లను ఏర్పాటుచేశారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |