ఏపీలో ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. కానీ తెలంగాణలో ఇంకా ఇంటర్ ఫలితాలు విడుదల కాలేదు. దీంతో విద్యార్థులు ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏపీ కంటే ముందుగానే తెలంగాణలో పరీక్షలు నిర్వహించినప్పటికీ.. ఫలితాల విడుదలో మాత్రం జాప్యం జరుగుతోంది. అయితే ఎలాంటి తప్పులు లేకుండా ఫలితాలు విడుదల చేయాలని విద్యాశాఖ భావిస్తోంది. అందుకే ఫలితాల విడుదల ఆసల్యమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పేపర్ వాల్యూయేషన్ పూర్తయింది.
ప్రస్తుతం విద్యార్థుల మార్కుల ఎంట్రీ కొనసాగుతోన్నట్లు సమాచారం. విద్యార్థుల డేటా ఎంట్రీ పూర్తయిన తర్వాత ఫలితాలు ప్రకటించే అవకాశం ఉంది. డేటా ఎంట్రీ దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది. ఇంటర్ ఫలితాలను ఏప్రిల్ 22 విడుదల చేసే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. కానీ ఇంటర్ ఫలితాలపై విద్యా శాఖ క్లారిటీ ఇచ్చింది. ఇంటర్ ఫలితాలను ఏప్రిల్ 24 ఉదయం 11 గంటలకు విడుదల చేయాలని విద్యాశాఖ నిర్ణయించినట్లు తెలుస్తోంది. పదో పరీక్షల ఫలితాలు కూడా విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు.
పది ఫలితాలను ఏప్రిల్ 30 లేదా మే 1న ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు ఇంటర్, పదో తరగతి ఫలితాల విడుదలకు ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. కాగా తెలంగాణలో ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు దాదాపు 9 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో మొదటి సంవత్సరం విద్యార్థులు 4,78,527 మంది కాగా.. రెండో సంవత్సరం విద్యార్థులు, 4,43,993 మంది ఉన్నారు. అన్సర్ పేపర్లను మూడు సార్లు పరిశీలించినట్లు అధికారులు చెబుతున్నారు.
అలాగే డీకోడింగ్, కోడింగ్ ప్రక్రియ కూడా పూర్తయినట్లు వివరించారు. గత సంవత్సరం ఇంటర్ ఫలితాలను మే 9న ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈసారి ఎన్నికలున్న నేపథ్యంలో ముందే ప్రకటిస్తున్నారు. ఎన్నికల కోడ్ ఉన్నందున మంత్రులు కాకుండా ఇంటర్ ఫలితాలను విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేయనున్నారు.









