UPDATES  

NEWS

 ఏపీలో చేనేతలకు ఉచిత విద్యుత్ అమలు..!

ఆంధ్రప్రదేశ్‌లోని చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక కానుక అందించింది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నెరవేరుస్తూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం చేనేతలకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఈ పథకం ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి రానుంది. దీని కింద చేనేత మగ్గాలకు నెలకు 200 యూనిట్లు, పవర్‌లూమ్‌లకు (మరమగ్గాలకు) 500 యూనిట్ల వరకు విద్యుత్‌ను ఉచితంగా సరఫరా చేయనున్నారు. విద్యుత్ ఛార్జీల భారాన్ని తగ్గించి, సంక్షోభంలో ఉన్న చేనేత వృత్తికి అండగా నిలవడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం.

 

ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1,04,488 చేనేత కుటుంబాలకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరనుంది. వీరిలో సుమారు 93,000 చేనేత మగ్గాల కుటుంబాలు, 11,488 పవర్‌లూమ్ కుటుంబాలు ఉన్నాయి. ఈ పథకం అమలు కోసం ప్రభుత్వం ఏటా సుమారు రూ.150 కోట్లు ఖర్చు చేయనుంది. ఈ రాయితీ ద్వారా ప్రతి చేనేత కార్మికుడి కుటుంబానికి ఏడాదికి రూ.8,640 ఆదా కానుండగా, ఒక్కో పవర్‌లూమ్‌ యూనిట్‌కు ఏటా రూ.21,600 వరకు ఆర్థిక వెసులుబాటు లభిస్తుంది. ముడిసరుకు, రంగుల అద్దకం, నేత పనులకు విద్యుత్ అత్యవసరం కావడంతో, ఈ ఉచిత సరఫరా వారి ఉత్పత్తి వ్యయాన్ని గణనీయంగా తగ్గించనుంది.

 

ఉచిత విద్యుత్ పథకంతో పాటు, చేనేత రంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం మరిన్ని కీలక చర్యలు చేపట్టింది. అధికారంలోకి వచ్చిన వెంటనే నేతన్నలకు ఇచ్చే పెన్షన్‌ను రూ.4 వేలకు పెంచింది. దీంతో పాటు రూ.5 కోట్ల విలువైన త్రిఫ్ట్ ఫండ్ నిధులను సహకార సంఘాలకు విడుదల చేసింది. ఆధునిక యంత్రాల కొనుగోలుపై 90 శాతం రాయితీ, ముడిసరుకులపై 15 శాతం సబ్సిడీ వంటి ప్రోత్సాహకాలను అందిస్తోంది. చిన్న తరహా క్లస్టర్ల అభివృద్ధికి రూ.10.44 కోట్లు కేటాయించింది.

 

అంతేకాకుండా, చేనేత ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు చేర్చేందుకు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఆన్‌లైన్ వేదికలతో మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తోంది. తాజాగా ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేయడం ద్వారా చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రభుత్వం మరో ముందడుగు వేసింది.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |