UPDATES  

NEWS

 రాష్ట్రవ్యాప్తంగా సొంతింటి పండగ.. 2.50 లక్షల గృహప్రవేశాలను ప్రారంభించిన చంద్రబాబు..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుపతి జిల్లా పర్యటనలో భాగంగా పేద ప్రజల సొంతింటి కలను సాకారం చేస్తూ భారీ గృహప్రవేశాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. తిరుపతి జిల్లా పుదూరులోని టిడ్కో (TIDCO) గృహ సముదాయంలో జరిగిన ఈ వేడుకలో ఆయన పాల్గొని, లబ్ధిదారులకు ఇళ్లను అందజేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది రెండోసారి నిర్వహిస్తున్న సామూహిక గృహప్రవేశాల కార్యక్రమమని, రాష్ట్రవ్యాప్తంగా నేడు 2.50 లక్షల గృహప్రవేశాలు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి సగర్వంగా ప్రకటించారు.

 

పేద కుటుంబాలకు నాణ్యమైన ఇళ్లు నిర్మించి ఇవ్వడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 5.50 లక్షల ఇళ్లు నిర్మించి ఇచ్చామని, రాబోయే డిసెంబర్ నాటికి మరో 4.50 లక్షల ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగిస్తామని హామీ ఇచ్చారు. కేవలం ఇళ్లు నిర్మించడమే కాకుండా, టిడ్కో గృహ సముదాయాల్లో పార్కులు, వాకింగ్ ట్రాక్‌లు మరియు ఇతర ఆధునిక మౌలిక సదుపాయాలను కల్పించామని ఆయన వివరించారు. తిరుపతి జిల్లాలో నేడు ఒక్కరోజే 15,659 ఇళ్లను ప్రారంభించడం విశేషమని పేర్కొన్నారు.

 

గృహ నిర్మాణ రంగంలో గత ప్రభుత్వం అనుసరించిన విధానాలను చంద్రబాబు తీవ్రంగా విమర్శించారు. అర్బన్ హౌసింగ్ కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను గత ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని, సుమారు రూ. 816 కోట్లు అప్పు మిగిల్చిందని ఆరోపించారు. నివాసయోగ్యం కాని ప్రాంతాల్లో ఇళ్లు కట్టాలని ప్రయత్నించి పేదలను ఇబ్బందులకు గురిచేశారని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టును నాశనం చేశారని విమర్శిస్తూ, గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరం పనులను పూర్తి చేస్తామని దృఢ నిశ్చయాన్ని వ్యక్తపరిచారు.

 

రాష్ట్ర రాజధాని అమరావతి విషయంలో ప్రభుత్వం తీసుకున్న చారిత్రక నిర్ణయాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. నిన్ననే అమరావతిపై తీర్మానం చేసి కేంద్రానికి పంపామని, చట్టం రూపుదాల్చిన తర్వాత రాజధానిని ఎవరూ కదల్చలేరని స్పష్టం చేశారు. భవిష్యత్తులో అమరావతిని హైదరాబాద్ మరియు చెన్నై కంటే మిన్నగా, నెంబర్ వన్ నగరంగా తీర్చిదిద్దుతామని ధీమా వ్యక్తం చేశారు. సాంకేతికతను జోడించి ‘మనమిత్ర’, ‘వాట్సప్ గవర్నెన్స్’ ద్వారా ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నామని తెలిపారు.

 

అభివృద్ధి పనులతో పాటు సంక్షేమ పథకాలను కూడా సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు చంద్రబాబు వివరించారు. ప్రతి నెల 1వ తేదీనే 63 లక్షల మందికి ఇంటి వద్దే పింఛన్లు అందిస్తున్నాం. ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నా ‘తల్లికి వందనం’ పథకం వర్తింపజేస్తున్నాం. మహిళల ఆర్థిక సాధికారత కోసం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నాం. వేట నిషేధ కాలంలో ఇచ్చే ఆర్థిక సాయాన్ని రూ. 20 వేలకు పెంచామని, సుదీర్ఘ తీర ప్రాంతాన్ని సద్వినియోగం చేసుకుంటామని చెప్పారు.

 

ప్రజలందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించడమే తమ కూటమి ప్రభుత్వ ధ్యేయమన్నారు. రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించేందుకు అహర్నిశలు కృషి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |